IPL 2021 : భారత మాజీ స్టార్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గౌతం గంభీర్ క్రికెట్ వదిలి వెళ్ళాక తరచూ వర్తమాన భారత క్రికెట్ జట్టు గురించి కామెంట్లు చేస్తుంటాడు. అతని మాటలు అప్పుడప్పుడూ వివాదాస్పదం కూడా అవుతుంటాయి. అయితే ధోనీకి, గంభీర్ కి మధ్య విభేదాలు ఉన్నాయని ఎప్పటి నుండో ఒక ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టే గంభీర్ కూడా అప్పుడప్పుడు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తుంటాడు.
కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా వహించినప్పుడు గంభీర్ ఐపీఎల్ లో 2 సార్లు ట్రోఫీ సాధించాడు. ఇక ఐపీఎల్ 14వ సీజన్ ఏప్రిల్ 9వ తేదీన మొదలు కానున్న విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పటిలాగే టైటిల్ ఫేవరెట్ అని వారి అభిమానులు అనుకుంటున్నారు. ఎంఎస్ ధోని సారథ్యం వహిస్తున్న ఈ జట్టు ఇప్పటివరకు ఐపీఎల్ లో పాల్గొన్న అన్ని జట్ల కంటే ఎక్కువ సార్లు ప్లే-ఆఫ్స్ చేరుకున్న రికార్డు సాధించింది.
గత ఐపీఎల్ సీజన్ మినహాయించి చెన్నై పాల్గొన్న ప్రతి ఐపీఎల్ లో వారు మొదటి నాలుగు స్థానాల్లో నిలుస్తూ వచ్చారు. అయితే గౌతమ్ గంభీర్ మాత్రం ఈసారి ఐపీఎల్ లో చెన్నై ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు చాలా తక్కువని చెప్పాడు. మూడు ఐపీఎల్ టైటిల్స్ సాధించిన చెన్నై జట్టు ఎవరికీ సాధ్యం కాని రీతిలో 11సార్లు ప్లే-ఆఫ్స్ చేరి ఘనమైన రికార్డు సృష్టించింది .అయితే ఈ సారి మాత్రం చెన్నై జట్టు బలహీనంగా ఉందని ఐదవ స్థానంలో లీగ్ దశని ముగించి ప్లే ఆఫ్ బెర్త్ ను పోగొట్టుకోవచ్చు అని గంభీర్ జోస్యం చెప్పాడు.
ఇక గంభీర్ మాటలపై చెన్నై ఫాన్స్ మండిపడుతున్నారు. మరోవైపు వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ మాత్రం నాలుగో స్థానంలో చెన్నై జట్టు ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించవచ్చని అన్నారు. మొత్తానికి చెన్నై జట్టుపైన ఈసారి చాలా మందికి తక్కువ అంచనాలు ఉన్నాయి. జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఎక్కువ కావడం, యువ ఆటగాళ్లకు పెద్దగా అనుభవం లేకపోవడం… క్రికెట్ కు ఇన్ని రోజులు దూరంగా ఉన్న ధోనీ ఫాన్ పై ఎలాంటి స్పష్టత లేకపోవడం ఇందుకు కారణాలు అని చెప్పవచ్చు.