Jagan KCR: అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు మూడు రకాల అజెండాలు ఉంటాయి. ఒకటి పొలిటికల్ (రాజకీయ) అజెండా, రెండు ప్రభుత్వ అజెండా, మూడు. వ్యక్తిగత అజెండా. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో నిధులు రాబట్టుకుని ప్రభుత్వ పరంగా, రాజకీయ పరంగా రాష్ట్రంలో మైలేజ్ తెచ్చుకోవడం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో వ్యక్తిగత వ్యవహారాలను చక్కబెట్టుకోవడం లాంటివి ఉంటాయి. అందుకే ప్రాంతీయ పార్టీలు చాలా వరకు కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబందాలు నెరుపుకోవడం కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసిఆర్, వైఎస్ జగన్ లు ఇప్పటి వరకూ అదే విధంగా ఉన్నట్లు అందరికీ తెలిసిందే. ఇరు రాష్ట్రాల పాలకులు ఢిల్లీలో ఒక వైఖరి, రాష్ట్రంలో ఒక వైఖరి అవలంబిస్తూ వస్తున్నారు. రాష్ట్రాల్లో తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బీజేపీని ఎగర్తిస్తున్నట్లుగా కనబడుతూనే కేంద్రంలో మాత్రం బీజేపీకి అవసరమైన (కీలక బిల్లుల ఆమోదం) సందర్భాలలో మద్దతు ఇస్తూ వస్తున్నారు.
Jagan KCR: కేంద్రంపై నిప్పులు చెరిగిన కేసిఆర్
ఇంతకు ముందు పలు కేంద్రంలో కీలక బిల్లుల విషయంలో మద్దతు ఇచ్చి మరీ రాష్ట్రంలో దానికి భిన్నంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. కేంద్రంతో సఖ్యతగా ఉన్నా తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్ లో మొండి చేయి చూపించింది. పోలవరం ప్రాజెక్టు, విభజన హామీల కింద దాదాపు 23వేల కోట్లు జగన్ సర్కార్ ఆశించింది. అయితే బడ్జెట్ లో కేంద్రం ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి ఇవ్వలేదు. అదే విధంగా తెలంగాణలో అనేక ప్రాజెక్టులు, నిధుల కోసం రెండు నెలలుగా కేసిఆర్ సర్కార్ లేఖలు రాస్తున్నా నిధుల కేటాయింపు జరగలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ సీఎం కేసిఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ నిప్పులు చెరిగారు. కానీ ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం మీడియా ముందుకు రాలేదు. ఏమి మాట్లాడలేదు. ప్రకటన కూడా విడుదల చేయలేదు.
ఈ రెండు పార్టీల స్టాండ్ ఎటు..?
త్వరలో ఈ రెండు రాష్ట్రాల అధికార పార్టీల అవసరం కేంద్రంలోని బీజేపికి రానున్నది. అప్పుడు వీరు ఏ రకమైన స్టాండ్ తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఈ ఏడాది జూలై నెలలో రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఆ ఎన్నికల్లో గెలుపునకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లు ఉన్న వైసీపీ, టీఆర్ఎస్ లు కీలక పాత్ర పోషించనున్నాయి. ఇప్పటి వరకూ లోపాయికారీ వ్యవహారాలతో కేంద్రంతో రహస్య స్నేహం చేస్తూ వచ్చిన ఈ రెండు పార్టీలు ఎటువంటి స్టాండ్ తీసుకుంటాయి అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ ఉంది. రాష్ట్రాలకు మోసం చేస్తున్న బీజేపీకి సహకరిస్తాయా..? లేదా అనేది వేచి చూడాలి.