వచ్చే ఎన్నికల్లో వైసీపీ-టీడీపీలు అధికారం కోసం.. తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఎన్నికలను చావో రేవో అన్నట్టుగా భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు శత విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు తిట్టిపోసిన బీజేపీతో చేతులు కలిపేందుకు ముందుకు సాగుతున్నారు. ఇక, జనసేనతో చేతులు కలిపి టికెట్లు కూడా పంచుకున్నారు.
ఇక, వైసీపీ కూడా దాదాపు ఇదే పరిస్థితిలో ఉంది. జగన్కు రెండో సారి కూడా అధికారంలోకి రావడం.. అత్యంత అవసరమని బావిస్తున్నారు. పైగాతాను చేసిన సంక్షేమం వృథాకాదని ఆయనభావిస్తున్నారు. ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకపోయినా.. బీజేపీతో అవగాహన కుదుర్చుకుని ముందుకు సాగుతున్నారనే చర్చ సాగుతోంది. సరే ఇంతగా ప్రయత్నించినా.. అధికారంలోకి వచ్చేది మాత్రం.. ఈ రెండు పార్టీల్లో ఏదొ ఒకటే. ఎవరు వస్తారనేది ప్రజలు నిర్ణయిస్తారు.
ఇదిలావుంటే.. ఇటు జగన్ ఓడితే ఏం జరుగుతుంది? చంద్రబాబు పరాజయం పాలైతే ఏం జరుగుతుంది ? అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. గెలుపు గుర్రం ఎవరినో ఒక్కరినే వరిస్తుంది కాబట్టి. సో.. ఈ కోణంలో ఆలోచిస్తే.. జగన్ కనుక ఎన్నికల్లో బలమైన ఎంపీ సీట్లను దక్కించుకోక పోతే.. అది పార్టీపైనే కాదు.. వ్యక్తిగతంగా ఆయన నమోదైన కేసుల పై కూడా ప్రభావం చూపిస్తుంది. ఇక, ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకోలేక పోతే.. రేపు టీడీపీ అధికారంలోకి వస్తే.. అరెస్టులు, కేసులు.. భారీ ఎత్తున చవి చూడాల్సి ఉంటుంది.
ఇక, చంద్రబాబు కనుక అధికారంలోకి రాకపోతే.. పార్టీనే మిగలదనే చర్చ సాగుతోంది. ఇది కొంత కఠినం గా ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మరో ఐదేళ్లపాటు పార్టీని కాపాడుకోవడం.. చంద్రబాబు ఆరోగ్య రీత్యా కష్టమనే వాదన వినిపిస్తోంది. నారా లోకేష్ పార్టీ కోసం ప్రయత్నించినా.. ఆయనతో కలిసి వచ్చే నేతలు తక్కువగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలకు కూడా.. ఈ గెలుపు చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. మరి జనం ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.