Breaking: జమ్ములో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జజ్జర్ కొట్లి బ్రిడ్జి వద్ద బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, మరో 16 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తొంది. ఈ తెల్లవారుజామున అమృత్ సర్ నుండి కత్రాకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం గురించి తెలియగానే పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ ఇతర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ బస్సులో బీహార్ కు చెందిన ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. బస్సు కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనేది తెలుసుకునేందుకు క్రేన్ తెప్పించే పనిలో అధికారులు ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.