BRS: తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నేడు తీవ్ర గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు వరుసగా గుడ్ బై చెబుతున్నారు. కొందరు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతుండగా, మరి కొందరు బీజేపీలో చేరుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవికి సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రాజీనామా చేశారు.
బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తొంది. ఈ నెల 14వ తేదీ (రేపు) మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ చేరనున్నట్లు ప్రకటించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కోనప్ప కలిశారు. అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసినట్లుగా తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని సీఎం తనను ఆహ్వానించారని ఆయన చెప్పారు. కోనప్పతో పాటు షాహీన్ సుల్తానా, పలువురు నేతలు అధికార పార్టీలో చేరనున్నారు.
సిర్పూర్ నుండి వరుసగా రెండు సార్లు 2014, 2018 ఎన్నికల్లో గెలిచిన కోనేరు కోనప్ప.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3వేల ఓట్ల తేడాతో ఓటమి పాలైయ్యారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు 44వేలకుపైగా ఓట్లు వచ్చి మూడో స్థానం నిలవగా, బీఆర్ఎస్ అభ్యర్ధి కోనేరు కోనప్పపై 3వేల పైచికులు ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్ధి పాల్వాయి హరిబాబు విజయం సాధించారు.
ఎన్నికలో తన ఓటమికి కారణమైన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో నడవాలని బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ నిర్ణయించుకోవడంపై కోనేరు కోనప్ప తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేసిఆర్ కు తాను ఎంతో గౌరవం ఇచ్చాననీ, పాత్తు విషయంపై తనతో మాటమాత్రంగానైనా చెప్పకపోవడంపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తొంది.
వాస్తవానికి కోనేరు కొనప్ప కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడే. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా సిర్పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలి సారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో , 2010 లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్ధి చేతిలో పరాజయం పాలైయ్యారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు. 2014 లో బీఎస్పీ అభ్యర్ధిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్ధిపై విజయం సాధించారు. ఆ తర్వాత అధికార టీఆర్ఎస్ లో చేరిన కోనప్ప 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి మరో సారి గెలుపొందారు.
మరో పక్క స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియ శ్రీహరి కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని వార్తలు వినబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుండి వరంగల్ ఎంపీ అభ్యర్ధిగా కడియం శ్రీహరి పోటీ చేయాలని భావిస్తున్నారని, ఆయన కుమార్తె కావ్య ను ఖాళీ కాబోయే స్టేషన్ ఘన్ పూర్ నుండి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ తో అవగాహన కుదిరిందని ప్రచారం జరుగుతోంది. మరో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆదూరి రమేష్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరనున్నారని సమాచారం. నిన్న అమిత్ షా ను కలిసి వరంగల్ ఎంపీ టికెట్ ను కన్ఫర్మ్ చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
AP High Court: 2018 గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు ..