YSRCP: ఎన్నికల వేళ వైసీపీకి వరుస షాక్ లు ఇస్తున్నారు ఆ పార్టీ కీలక నేతలు. పార్టీని ఒక్కొక్కరుగా వీడుతున్నారు. కొందరు పదవులు సైతం త్యజిస్తూ పార్టీని వీడుతున్నారు. రెండు మూడు రోజుల వ్యవధిలోనే ముగ్గురు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి మొన్న రాజీనామా చేయగా, నిన్న చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పార్టీని వీడారు.
తాజాగా మరో కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి హిందూపురం నేత మహమ్మద్ ఇక్బాల్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్ కు లేఖ పంపారు. ఎమ్మెల్సీగా తన రాజీనామా లేఖను శాసనమండలి చైర్మన్ కు పంపించారు. 2027 మార్చి వరకూ ఎమ్మెల్సీ పదవీ కాలం ఉన్నప్పటికీ రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు ఇక్బాల్.
అనంతపురం జిల్లా హిందూపురం నుండి గత ఎన్నికల్లో పోటీ చేసిన మహ్మద్ ఇక్బాల్ ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్ ఆయనకు ఎమ్మెల్సీ గా అవకాశం కల్పించారు. అయితే ఈ సారి ఆయనకు హిందూపురం టిక్కెట్ ఇవ్వలేదు. హిందూపురం వైసీపీ అభ్యర్ధిగా దీపికను పార్టీ ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఆయన కదిరి అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు.
అయితే కదిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చిన పార్టీ అధిష్టానం మైనార్టీ నేతకు అవకాశం కల్పించింది. దీంతో గత కొంత కాలం నుండి పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. తాజాగా పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం అనంతపురం జిల్లాలో వైసీపీకి ఎన్నికల వేళ రాజకీయంగా ఇబ్బందులు తప్పవని పార్టీ నేతలు చెబుతున్నారు.