ఎంతో సంతోషమైన జీవితం.. ఉన్నదానితోనే ఆనందంగా గడిపే కుటుంబం. భార్యా పిల్లలతో ఏదో ఒక పనిచేసుకుంటూ జీవించే ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనుకోని ఘటన వారి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేసింది. పనికై వెళ్లిన భర్త గుట్టలో శవమై తేలాడు. అసలు ఏం జరిగింది? అది హత్యా? లేక ఆత్మహత్యా? ఇది కారణం తెలియని చావుగా మిగిలిపోయింది.
పని కోసం రెండు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మఈతి చెందాడు. పశువుల కాపరులు ఆ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అనంతపురం జిల్లా పెనుకొండలో వెలుగుచూసింది. ఈ ఘటన ఒక మిస్టరీగా మారింది.
కొత్తచెరువు గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన వడ్డే శ్రీనివాసులు(27)భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ జీవించేవాడు. రోజూ పని కోసం పెనుగొండకు వెళ్లి వచ్చేవాడు. అయితే గత ఆదివారం సాయంత్రం బైక్ పై బయటకెళ్లిన శ్రీనివాసులు మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో అతని కుటుంబ సభ్యులు అతని ఆచూకి కోసం అంతా వెతికారు. దీంతో వారు ఆందోళనతో పోలీసులను ఆశ్రయించారు. రెండు రోజుల తర్వాత శ్రీనివాసులు పెనుకొండ రహదారిలో బండ్లపల్లి సమీపాన గుడ్డిబావి వద్ద శవమై కనిపించాడు.
శవాన్ని గుర్తించిన పశువుల కాపర్లు పోలీసులకు సమాచారమిచ్చారు. దాంతో పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని శవాన్ని పరిశీలించి శ్రీనివాసులుగా గుర్తిచారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అయితే శ్రీనివాస్ ది హత్యా? లేక పోతే ఆత్మహత్యా.. లేక రోడ్ ప్రమాదంలో చనిపోయాడా..లేక మరేదైనా జరిగుంటుందా అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మరణం మిస్టరీగానే మిగిలింది.