ఇంట్లో పనికిరాని వస్తువులు ఎక్కువగా ఉన్నాయనే పడేస్తే అలాగే జరుగుతుంది మరి. వస్తువులను పడేసేటప్పుడు ఒక్కసారి వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ఏమో.. అందులో మనకు పనికివచ్చే వస్తువులే ఉండవచ్చు, లేదా రూ. లక్షల విలువ చేసే ఆభరణాలు ఉండవచ్చు. మనం ఏ వస్తువును ఎక్కడ పెట్టామో సహజంగానే మరిచిపోతాం కదా. అలాగే ఆ మహిళ కూడా మరిచిపోయింది. పనికిరాని పాత పర్సే కదా అని పడేసింది. కానీ చివరికి విషయం తెలిసి షాక్కు గురైంది. ఎట్టకేలకు తన పర్సును వెదికి పట్టుకుంది.
ఫూణె నగరంలో నివాసం ఉండే రేఖా సెలుకర్ అనే మహిళ దీపావళి సందర్భంగా ఇంటిని శుభ్రం చేసుకుంది. అందులో భాగంగా ఇంట్లో ఓ చోట పడిఉన్న పాత పర్సును పనికిరాదని చెప్పి చెత్త తీసుకు వెళ్లే వ్యాన్ వారికి ఇచ్చింది. అయితే కొంత సేపటికి ఆ పర్సులో విలువైన ఆభరణాలు ఉన్నాయని గ్రహించి షాక్ తిన్నది. వెంటనే పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (పీసీఎంసీ) ఉద్యోగుల వద్దకు వెళ్లి విషయం చెప్పింది.
ఈ క్రమంలో పీసీఎంసీ ఉద్యోగులు సుమారుగా 1 గంట పాటు చెత్తను క్షుణ్ణంగా వెదికారు. ఈ క్రమంలో ఆమె పర్సు లభించింది. అందులో కొన్ని గోల్డ్ చెయిన్స్, ఉంగరాలు మొత్తం కలిపి రూ.3 లక్షల విలువ చేసే ఆభరణాలు ఉన్నాయి. దీంతో ఆమె హమ్మయ్య అని ఊపిరిపీల్చుకుంది. లేదంటే క్షణాల్లో రూ.లక్షల విలువ చేసే ఆభరణాలు చెత్త పాలై ఉండేవి. అందుకనే.. పాత వస్తులను పడేసేటప్పుడు ఎవరైనా సరే ఒక్కసారి చెక్ చేసుకుంటే మంచిది. లేదంటే.. ఇదిగో.. పైన చెప్పిన మహిళకు జరిగినట్లుగానే సంఘటనలు ఎదురుకావచ్చు. నిజంగా ఆమెకు లక్ బాగుండబట్టి పర్స్ మళ్లీ దొరికింది. కానీ అన్ని సందర్భాల్లోనూ ఇలా జరగదు. కనుక ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది.