న్యూఢిల్లీ: తమిళనాడులో బోరు బావిలో పడిపోయిన రెండేళ్ల బాలుడు సుజీత్ క్షేమంగా బయటకు రావాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. దేశ వ్యాప్తంగా దీపావళి పండుగ జరుపుకొంటుంటే, ఆ రాష్ట్రం మాత్రం సుజిత్ కోసం ఎదురు చూస్తోందని, ఆ బాలుడిని రక్షించుకోవాలన్న ప్రయత్నంలో ఉందని ట్వీట్ చేశారు. ‘చిన్నారి ప్రమాదవశాత్తూ శుక్రవారం బోరుబావిలో పడిపోయాడు. అతడు క్షేమంగా బయటకు రావాలని కోరుకుంటున్నా. బాలుడి కోసం అతడి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు, వీలైనంత త్వరగా బయటకు రావాలని ప్రార్థిస్తున్నా’ అని రాహుల్ పేర్కొన్నారు.
While the nation celebrates Deepavali, in Tamil Nadu a race against time is underway to save baby Surjeeth, who has been trapped in a borewell since Friday. I pray that he will be rescued & reunited with his distraught parents at the earliest ?#savesurjeeth
— Rahul Gandhi (@RahulGandhi) October 27, 2019
తమిళనాడులోని తిరుచ్చి జిల్లా నాడుకట్టుపట్టికి చెందిన రెండేళ్ల సుజీత్ విల్సన్ అక్టోబర్ 25న ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. సుమారు 88 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో చిక్కుకుని పోయిన సుజీత్ను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సుజిత్ బోరుబావిలో పడిన క్షణం నుంచి రక్షించేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ కూడా రంగంలోకి దిగి బాలుడిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. నిరంతరం బాలుడికి ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు.
తొలుత 30 అడుగుల లోతులో సుజిత్ ఉన్నట్లు గుర్తించి.. బావికి సమాంతరంగా మరో గుంతను తవ్వారు. అయితే ప్రొక్లెయిన్తో బాలుడు మరింత లోతుకు వెళ్లే ప్రమాదం ఉందని ఆ ప్రయత్నాన్ని విరమించారు. మరో వైపు మధురైకి చెందిన ఒక రోబో పరికరాన్ని ఉపయోగించి బాలుడిని బయటికి తీసేందుకు ప్రయత్నించగా.. పట్టు తప్పి బాలుడు మరింత లోతుకు వెళ్లిపోయారు. దాంతో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
సహాయక చర్యల్లో మద్రాస్ కు చెందిన ఆరు నిపుణుల బృందాలు పాల్గొంటున్నాయి. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇప్పటి వరకు ఐదుగురు మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు సహాయక చర్యలు పరిశీలించారు. బాలుడు మరింత లోతుకు వెళ్లకుండా.. చర్యలు తీసుకున్నామని పన్నీర్ సెల్వం తెలిపారు. నిరంతరం ఆక్సిజన్ అందిస్తున్నామన్నరు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా.. నిరూపయోగంగా ఉన్న బోరుబావులను మూసివేయాలని పన్నీర్ సెల్వం సూచించారు. ఈ ఘటనపై సినీ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా స్పందించారు. బారు బావి నుంచి బాలుడు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు బాలుడి సుజిత్ క్షేమంగా రావాలని బంధువులు, ప్రజలు కొండంత ఆశాతో ఎదురుచూస్తున్నారు.