(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్”ప్రతినిధి)
ఏపిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న పలు నిర్ణయాలను ప్రతిపక్షాలు తప్పుబట్టి విమర్శించడం, పలువురు కోర్టులను ఆశ్రయించడంతో అవి పెండింగ్లో పడటం చూస్తునే ఉన్నాం. జగన్మోహనరెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఆ పార్టీ నేతలు సమర్థించడం, ప్రతిపక్షాలు విమర్శించడం సహజమే. ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడే కాక అనేక అంశాలపై పూర్తి స్థాయి అవగాహన కల్గిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏపిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడి తీసుకుంటున్న నిర్ణయాలను అభినందించడంతో పాటు ప్రభుత్వ నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం తప్పు అని వ్యాఖ్యానించడం విశేషం.
ప్రస్తుతంలో ఏపిలో మూడు రాజధానుల అంశం, ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకంలో మీటర్ల ఏర్పాటు హాట్ టాపిక్గా ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంలో లోక్సత్తా పార్టీ అధినేత, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ ఓ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మోహమాటంగా తన అభిప్రాయాలను వెల్లడించారు.
రాజధాని ఎక్కడ పెట్టాలనేది ప్రభుత్వ నిర్ణయమని అన్నారు జయప్రకాష్ నారాయణ. పరిపాలనా వికేంద్రీకరణకు తాను పూర్తిగా సమర్ధిస్తున్నానని చెప్పారు జయప్రకాష్ నారాయణ. అదే విధంగా విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టడం అనేది మంచి నిర్ణయమని, దీని వల్ల వృధాగా పోతున్న విద్యుత్ ఆదా చేయవచ్చని అన్నారు. ఈ విషయాల్లో సిఎం జగన్మోహనరెడ్డిని అభినందిస్తున్నానన్నారు.
ప్రభుత్వ నిర్ణయాల్లో కోర్టుల జోక్యం తప్పన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకునే హక్కు కోర్టులకు లేదని జయప్రకాష్ నారాయణ అన్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది ప్రభుత్వానికి గానీ జడ్జిలకు కాదని ఈ విషయాన్ని అందరూ గమనించాలన్నారు.
ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడే కాకుండా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన జయప్రకాష్ నారాయణ సీఎం జన్మోహనరెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను సమర్ధిస్తూ తన అభిప్రాయాలను వ్యక్తం చేయడం వైసీపీ శ్రేణులకు బూస్ ఇచ్చినట్లు అయ్యింది అంటున్నారు.