BJP: రాజకీయాల్లో నాయకులు ఎప్పుడు ఏ పార్టీకి మారతారో ఎవరికీ తెలియదు. ఒక పార్టీ అభ్యర్ధిగా బరిలో దిగుతారు అనుకున్న నేత అకస్మాత్తుగా ప్రత్యర్ధి పార్టీలో చేసి అభ్యర్ధిగా బరిలో దిగుతుంటారు. రాజకీయాల్లో గతంలో మాదిరిగా సిద్ధాంతాలు, విలువలు ఇప్పుడు లేవు. పదవి, గెలుపే పరమావధిగా రాజకీయ పార్టీల నాయకులు చొక్కాలు మార్చినట్లుగా పార్టీలను మారుస్తుంటారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పలువురు కీలక నేతలు ప్రత్యర్ధి పార్టీల్లో చేరి అభ్యర్ధులుగా అవుతున్నారు.
నియోజకవర్గాల్లో బలమైన నేతలుగా పార్టీలు గాలం వేస్తున్నాయి. బీఆర్ఎస్ నుండి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు నేతలు ఆయా పార్టీ తరపున లోక్ సభ అభ్యర్ధులుగా బరిలో దిగుతున్నారు. సాధారణంగా నేతలు తాము ఉన్న పార్టీలో టికెట్ రాకపోతే ప్రత్యర్ధి పార్టీలో చేరడం చూస్తూనే ఉన్నాం. అయితే అభ్యర్ధిత్వం కన్ఫర్మ్ అయినా కూడా కొందరు నేతలు అకస్మాత్తుగా ప్రత్యర్ధిలోకి జంప్ అవుతుండటం ఆయా పార్టీలకు మింగుడుపడటం లేదు.
బీఆర్ఎస్ వరంగల్ లోక్ సభ అభ్యర్ధిగా బరిలో ఉంటారని భావించిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇటీవల ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. బీజేపీ నుండి ఆయన ఎన్నికల బరిలో నిలవనున్నారు. తాజాగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా నిలుస్తారు అనుకున్న కీలక నేత ఆ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు.
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా దివంగత నేత సాయన్న కుమార్తె లాస్య నందిత విజయం సాధించిన విషయం తెలిసిందే. గత ఫిబ్రవరి లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈ క్రమంలో మొన్నటి ఎన్నికల్లో కంటోన్మెంట్ నుండి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేష్ ను మరో సారి బీజేపీ అభ్యర్ధిగా ఆ పార్టీ దాదాపుగా నిర్ణయించింది.
కాంగ్రెస్ తరపున పోటీ చేసిన దివంగత గద్దర్ కుమార్తె వెన్నెల మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఈ సారి ఉప ఎన్నకల్లో ఆమెకే టిక్కెట్ దక్కుతుందని అంతా భావించారు. అయితే గట్టి అభ్యర్ధిని నిలిపి కంటోన్మెంట్ ను తమ ఖాతాలో వేసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. దీనిపై స్థానిక నేతలతో ఆయన మాట్లాడగా, ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్న బీజేపీ నేత శ్రీగణేష్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని అభ్యర్ధిగా నిలిపితే గెలుపు పక్కా అన్న సమాచారం వచ్చిందట.
దీంతో రేవంత్ రెడ్డి సూచనలతో కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, మహేందర్ రెడ్డి లు గణేష్ తో చర్చలు జరపగా టిక్కెట్ హామీ ఇస్తే వస్తానని చెప్పడంతో పార్టీ ఒకే చెప్పింది. దీంతో మంగళవారం రాత్రి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ నివాసంలో నేతలు శ్రీగణేష్ కు కాంగ్రెస్ కండువా కప్పారు. మంగళవారం మధ్యాహ్నం వరకూ మల్కాజ్ గిరిలో బీజేపీ నేత ఈటల రాజేందర్ తో కలిసి ప్రచారంలో పాల్గొన్న శ్రీగణేష్ .. రాత్రికి రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఆ పార్టీ నేతలు ఖంగుతిన్నారు. అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని శ్రీగణేశ్ పేర్కొంటున్నారు.