అమరావతి: ఏలూరుకు చెందిన టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు (బుజ్జి) తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. గుండెపోటుతో అస్వస్థతకు గురైన బుజ్జిని కుటుంబ సభ్యులు విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. బుజ్జి దివంగత ప్రముఖ సినీ నటుడు ఎస్వి రంగారావుకు స్వయాన మేనల్లుడు.
గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించిన బుజ్జి 2009లో ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో టిడిపి తరుపున 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
బుజ్జి మృతి పట్ల అధినేత చంద్రబాబు, నేతలు సంతాపాన్ని తెలియజేశారు. బుజ్జి కుటుంబ సభ్యులను చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పలువురు టిడిపి నేతలు బుజ్జి అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించేందుకు బయలుదేరి వెళ్లారు.