విజయవాడ టిడిపిలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్యలో ఎమ్మెల్సీ రాజకీయం సాగుతోంది.ఎప్పుడో జరిగే మేయర్ ఎన్నికల అభ్యర్థిత్వ విషయంలో ఈ వివాదం చోటుచేసుకుంది.
విజయవాడ మేయర్ పదవి మహిళలకు రిజర్వు కాగా మేయర్ అభ్యర్థిత్వం తమకే ఖరారైనట్లుగా ఒక వర్గం…ఇదేంటని నిలదీస్తూ మరో వర్గం విజయవాడలో రాజకీయ రచ్చకు తెరలేపుతున్నాయి.వివరాల్లోకి వెళితే విజయవాడ కార్పొరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థిత్వం ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేతకి ఖాయమైనట్లుగా నాని వర్గీయులు కొద్దిరోజులుగా ప్రచారం చేసుకుంటున్నారు. శ్వేతను రంగంలోకి దించాలని ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లుగా వారు శ్రేణుల వద్ద ప్రస్తావిస్తుండటం గమనార్హం. విద్యావంతురాలు కూడా కావడంతో చంద్రబాబు శ్వేతను అభ్యర్థిగా బరిలోకి దించితే బావుంటుందని భావించారని చెప్పుకుంటున్నారు.
శ్వేత విజయవాడ ఎంపీ కేశినేని నాని రెండో కుమార్తె ఆమె గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లో కేశినేని నాని తరుపున విస్తృతంగా ప్రచారం చేయడంతో స్థానిక రాజకీయాలతో పరిచయం ఏర్పడింది. అయితే మేయర్ అభ్యర్థిగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రాంమోహన్రావు సతీమణి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ అనురాధ కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెకు మేయర్ అభ్యర్థిత్వం దక్కేలా రాంమోహన్రావు ఇప్పటికే చంద్రబాబు వద్ద కూడా హామీ తీసుకున్నట్లుగా పార్టీలోని ఆయన వర్గీయులు చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో కాబోయే మేయర్ శ్వేత గారికి జై అంటూ నాని అనుచరులు హడావుడి చేయడంతో ఇరు వర్గాల మధ్య రాజకీయ విబేధాలు తలెత్తాయి.
దీంతో గద్దె రామ్మోహన్, ఆయన సతీమణి ఈ విషయంపై విజయవాడ నగర టీడీపీ ఇంచార్జ్ ,ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు వారు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వివాదం ఇప్పుడు బుద్దా వెంకన్న కోర్టులోకి చేరింది. వాస్తవానికి ఎంపీ నానికి, బుద్దా వెంకన్నకు మధ్య వివాదం నడుస్తోంది. కొన్నిరోజుల పాటు ఇరువురు కూడా తీవ్ర విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన ఎలాంటి వైఖరి అవలంభించబోతున్నారనే దానిపై కూడా ఆసక్తి నెలకొంది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ టిడిపికి కూడా ముఠా కుమ్ములాటలు తలనొప్పిగా మారడమే ఇక్కడి విశేషం .