తెలంగాణలో దీపావళి టపాసులపై హైకోర్టు నిషేదం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో బాణాసంచా విక్రయాలపై ప్రభుత్వం నిషేదం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ నేడు సుప్రీం కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీపావళి సందర్భంగా క్రాకర్స్ అమ్మకాలపై బ్యాన్ విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని అసోసియేషన్ కోరింది. ఇప్పటికే తాము షాపుల్లో బాణా సంచా నిల్వలు పెద్ద ఎత్తున ఉంచామనీ, పండుగకు రెండు రోజుల ముందు నిషేదం విధిస్తే తాము కోట్లలో నష్టపోతామని అసోసియేషన్ పిటిషన్లో పేర్కొన్నది. హైకోర్టు తీర్పు వల్ల తీవ్రంగా నష్టపోయి చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టనున్నది.
కాగా హైకోర్టు ఆదేశాల మేరకు క్రాకర్స్ అమ్మకాలపై నిషేదం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో టపాసుల అమ్మకంపై నిషేదం ఉన్నందున తక్షణం టపాసుల దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పది రాష్ట్రాల్లో టపాసుల అమ్మకాలపై నిషేదం విధించారు. ఆయా రాష్ట్రాల హైకోర్టుల ఆదేశాల మేరకు టపాసుల అమ్మకాలపై ప్రభుత్వాలు బ్యాన్ విధించాయి. ప్రస్తుత కరోనా పరిస్థితులను కారణంగా చూపి టపాసుల విక్రయాలను నిషేదించినందున సుప్రీం కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.