బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. పాదయాత్ర ఆపాలంటూ వరంగల్లు పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. పోలీసులు జారీ చేసిన నోటీసులపై నిన్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు నేడు పిటిషన్ ను విచారణ జరిపింది. విచారణ సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బండి సంజయ్ పాదయాత్రను నిలుపుదల చేసిన వర్ధన్నపేట ఏసీపీతో పాటు తెలంగాణ పోలీసు శాఖ తరఫున వాదనలు వినిపించేందుకు అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ హాజరయ్యారు. బండి సంజయ్ తన పాదయాత్రలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారంటూ వాదనలు వినిపించిన ఏజీ.. బండి సంజయ్ ప్రసంగాలకు సంబంధించిన వీడియోలను పెన్ డ్రైవ్లో కోర్టుకు అందజేశారు ఏజీ అందజేసిన పెన్ డ్రైవ్ను తదేకంగా పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి…పెన్ డ్రైవ్తో ఏం చేసుకోవాలని ఏజీని ప్రశ్నించారు.
కోర్టుకు సమర్పించే ఆధారాలు ఏ రూపంలో ఉండాలో మీకు తెలియదా? అంటూ ఏజీని న్యాయమూర్తి నిలదీశారు. డాక్యుమెంట్ల సమర్ఫణలోనూ నిబంధనలు పాటించకుంటే ఎలాగంటూ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోలను సమర్పించాల్సి రావడంతోనే పెన్ డ్రైవ్లో ఇవ్వాల్సి వచ్చిందనీ, సాఫ్ట్ కాపీల్లో ఆ వీడియోలను అందజేస్తామని ఏజీ చెప్పడంతో న్యాయమూర్తి శాంతించారు. బీజేపీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారనీ, ఇప్పటికే రెండు విడుదల పాదయాత్ర పూర్తి అయ్యిందనీ, ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు రాలేదనీ, ఇప్పుడు మూడో విడత పాదయాత్ర కొనసాగుతోందని , పోలీసులు ఉద్దేశ పూర్వకంగానే పాదయాత్రను అడ్డుకునేందుకు సాగులు చెబుతున్నారంటూ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం … పోలీసులు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది. పోలీసుల నోటీసులు రాజ్యాంగ విరుద్దంగా ఉన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది.
పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బండి సంజయ్ రేపు ఉదయం నుండి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగించనున్నారు. షెడ్యుల్ ప్రకారం ఈ రోజు పాదయాత్ర ఎక్కడ నుండి ముగుస్తుందో అక్కడి నుండి యాత్ర పునః ప్రారంభం కానున్నది. ఈ నెల 27వ మూడో ప్రజా సంగ్రామ యాత్ర ముగియనుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా హజరు కానున్నారు.