ప్రధానమంత్రి నరేంద్ర మోడి సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారా? దేశం అంతా ఎదురుచూస్తున్న అంశంలో చొరవ తీసుకోవాలని భావిస్తున్నారా? ప్రస్తుత పరిణామాలు , వివిధ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు ఇదే సమాధానం వస్తోంది. ఇదంతా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు . త్వరలో జరగనున్న ఎపిసోడ్ గురించి.
రచ్చ రచ్చగా ఢిల్లీ
ఢిల్లీలో గత 23 రోజులుగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పంజాబ్ హర్యానా నుంచి వచ్చిన రైతులు ఈ ఆందోళనలు చేస్తున్నారు. అయితే, చట్టాల్లో రైతులు కోరిన విధంగా సవరణలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చింది. చట్టాల్లో 8 సవరణలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా ఇప్పటికే స్పష్టం చేసింది. కానీ, రైతులు మాత్రం చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని, అప్పటి వరకు ఆందోనలు చేస్తామని అంటున్నారు. మరోవైపు ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీవైపు వస్తున్న ట్రాక్టర్లను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో రైతు సంఘాల నేతలు ఘాజీపూర్ అధికారులతో చర్చలు జరపబోతున్నారు. ట్రాక్టర్లను అనుమతించకుంటే ఢిల్లీ -మీరట్ జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.
మోడీ కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న వాటిపై రైతులు, ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించిన బీజేపీ ఈ మేరకు చర్యలను ముమ్మరం చేసింది. మాజీ ప్రధాని వాజ్పేయీ జయంతిని పురస్కరించుకొని డిసెంబర్ 25న ప్రధాని నరేంద్ర మోడీ రైతులతో ముచ్చటించనున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇక మరో పక్క ఉత్తర ప్రదేశ్ లోని 2500లకు పైగా ప్రాంతాల్లో కిసాన్ సంవాదక్ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు భాజపా వర్గాలు పేర్కొన్నాయి. రైతులతో ప్రధాని మోడీ భేటీ కానున్న నేపథ్యంలో యూపీ భాజపా చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్, పార్టీ నేత రాధామోహన్ సింగ్లు కార్యకర్తలతో వర్చువల్గా సమావేశమయ్యారు. పేదలు, రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు సంస్కరణలు తెచ్చి ఉంటే ఇప్పటికే రైతుల పరిస్థితి మెరుగ్గా ఉండేదని వారు అభిప్రాయపడ్డారు. వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఇదిలా ఉంటే, రైతులతో మరోసారి చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధం అయ్యింది. త్వరలోనే పరిస్థితులు సర్దుకుంటాయని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్ కి హామీ ఇచ్చారు.