TRS: సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు నిరసనలు, ఆందోళనలు చేస్తే అధికార పార్టీ ఆ ఆందోళనలను, నిరసనలను అడ్డుకునే చర్యలు చేపడుతుంది. కానీ చిత్రమైన పరిస్థితి ఏమిటంటే తెలంగాణలో అధికార పార్టీనే నిరసనలకు పిలుపు నివ్వడం. అయితే ఇక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీ నిరసనలు చేపట్టడానికి కారణం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర విభజనపై సంచలన వ్యాఖ్యలు చేయడం. రాజ్యసభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు ఆ పార్టీ పిలుపు నిచ్చింది. ఈ మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో బీజేపీ దిష్టిబొమ్మలను దహనం చేయాలని కేటిఆర్ పిలుపునిచ్చారు. నల్లజెండాలతో ఆందోళనలు చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
Read More: Megastar : ఈ నెల 10న సీఎం జగన్ తో సినీ ప్రముఖుల సమావేశం.. టికెట్ ధరల వివాదం పరిష్కారం అయినట్లే..?
TRS: రాష్ట్ర విభజన శాస్త్రీయంగా జరగలేదు
రాజ్యసభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర విభజనపై మాట్లాడుతూ..పార్లమెంట్ లో తలుపులు మూసి, మైక్ లు కట్టేసి తెలంగాణ ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్ర విభజన శాస్త్రీయంగా జరగకపోవడం వల్ల ఇప్పటికీ రెండు రాష్ట్రాలు ఇప్పటికీ ఇబ్బందిపడుతున్నాయన్నారు. తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకంగా కాదంటూనే కాంగ్రెస్ పార్టీ నాడు రాష్ట్ర విభజన తీరును విమర్శించారు మోడీ. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పిలుపునిచ్చింది. మోడీ చేసిన కాంట్రీవర్సీ కామెంట్స్ తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపాయి.