ఆమె అధికార పార్టీ నాయకురాలు.. దానికి తోడు ఇటీవలే ఓ కార్పోరేషన్ చైర్మన్ పదవి లభించింది. దీంతో తన కారుకు పెద్ద అక్షరాలతో ఒ బోర్డు ఏర్పాటు చేసుకున్నారు. ఇక తన కారును ఎవ్వరూ ఎక్కడా ఆపరు అన్నది ఆమె ధీమా కావచ్చు. నిబంధనల ప్రకారం టోల్ ప్లాజాల వద్ద ఎమ్మెల్యే, ఎంపి వంటి ప్రజా ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాహనాలు, అంబులెన్స్ తదితర వాహనాలకు మాత్రమే టోల్ రుసుము నుండి మినహాయింపు ఉంటుందనే విషయం ఆ వైసీపీ మహిళా నేతకు తెలుసో తెలియదో కానీ తన కారును టోల్ ప్లాజా సిబ్బంది ఆపడంతో కోపం చిర్రెత్తుకొచ్చింది.
గుంటూరు జిల్లా కాజ టోల్ ప్లాజా వద్ద వడ్డేర కార్పోరేషన్ చైర్ పర్సన్ దేవళ్ల రేవతి చేసిన హంగామాకు అక్కడి సిబ్బంది బెంబేలెత్తిపోయారు. ఆమె గుంటూరు నుండి విజయవాడ వైపు కారులో వస్తూ కాజా టోల్ ప్లాజా వద్ద టోల్ రుసుము మినహాయింపు వాహనాలు వెళ్లే మార్గంలో రావడంతో సిబ్బంది అడ్డుకున్నారు. కార్పోరేషన్ చైర్మన్ అని కారుపై బోర్డు కనబడుతున్నా నా కారునే ఆపుతావా అంటూ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది మొదట ఆమెతో టోల్ రుసుము చెల్లించాల్సిందేనంటూ వాదనకు దిగారు. దీంతో ఆమె స్వయంగా బారిగేడ్లను తోసి అవతలపడేశారు. అడ్డు చెప్పిన ఓ యువకుడి చెంప చెళ్లు మనిపించారు. దీంతో ఇతర సిబ్బంది సైలెంట్ అయిపోయి ఆమె వాహనాన్ని పోనిచ్చారు. దీనిపై టోల్ ప్లాజా సిబ్బంది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మహిళా నేత టోల్ ప్లాజా వద్ద చేసిన హంగామా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇటువంటి సంఘటనలు గతంలోనూ టోల్ ప్లాజా వద్ద జరిగాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోని కొందరు నాయకులు తమ హవా చాటుకోవాలని ప్రయత్నిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతుంటారు.
ఆ మహిళా నేత అక్కడ ఏమి చేసిందో ఈ కింద క్లిక్ చేసి మీరు చూడండి