IPL 2021: కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నిన్నటి మ్యాచ్ కు ముందు ఐదు మ్యాచ్ లు ఆడి ఒకే ఒక్క విజయంతో పాయింట్స్ టేబుల్ లో అట్టడుగున ఉంది.. మరొక వైపు పంజాబ్ జట్టు తమ ముందు మ్యాచ్ లోనే భీకర ముంబై ఇండియన్స్ పై సంపూర్ణ విజయం సాధించి ఊపు మీద ఉన్నారు, ఇలాంటి సమయంలో పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లోకి ఫేవరెట్ గా దిగాలి కానీ మ్యాచ్ మొదలైన మొదటి బంతి నుండి కోల్కతా నైట్రైడర్స్ జట్టు ప్రత్యర్థి పై ఆధిపత్యం ప్రదర్శించింది. అసలు పంజాబ్ లో సమతుల్యత ఎక్కడ దెబ్బతింది? వారికి ప్లే-ఆఫ్ అవకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం…..
ముందుగా పంజాబ్ బ్యాటింగ్ విషయానికి వస్తే… ఈ ఐపీఎల్ లో వారు మూడు సార్లు మొదటి బ్యాటింగ్ చేసినప్పుడు 130 కన్నా తక్కువ స్కోర్లు కొట్టారు. అందులో రెండు సార్లు 120 పరుగులు కన్నా తక్కువ పరుగులు చేయగలిగారు. కానీ లైనప్ లో పేర్లు చూస్తే గేల్, పూరన్, కె.ఎల్.రాహుల్ లాంటి క్వాలిటీ ప్లేయర్లు ఉన్నారు. పంజాబ్ కు గేల్ మూడవ స్థానంలో బరిలోకి దిగుతున్నాడు. అతను కొత్త బంతిని ఎదుర్కొనే అవకాశం లేదు.
పైగా… రాహుల్, మయాంక్ అగర్వాల్ దాదాపు పవర్ ప్లే మొత్తం ఆడేస్తారు కాబట్టి అతను బరిలోకి దిగే సమయానికి బౌండరీల వద్ద ఫీల్డర్లు మొహరించి ఉంటారు. ఉంటారు అంతే కాకుండా ఎన్నో ఏళ్ళనుండి గేల్ ఆట చూసిన వారు అతనికి పక్కా ప్రణాళికతో బౌలింగ్ కి దిగుతుంటారు. దీనికితోడు చెన్నై, అహ్మదాబాద్ లాంటి స్లో పిచ్ ల పై గేల్ అంత ప్రభావం చూపించలేడు.
కెప్టెన్ కె ఎల్ రాహుల్ కూడా అసలు తన స్థాయి స్ట్రోక్ ప్లే ని ప్రదర్శించడం లేదు. అతనిలోదూకుడు పూర్తిగా లోపించింది. కెప్టెన్సీ ఒత్తిడిని భుజాలపై మోస్తూ స్కోరు వేగం ఆమాంతం పెంచే కార్యక్రమంలో వికెట్ ఇచ్చి జట్టుని మరింత కష్టాల్లోకి నెట్టేస్తున్నాడు.
పంజాబ్ మిడిలార్డర్, బౌలింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పూరన్ వరుసగ విఫలం కావడం పంజాబ్ ని బాధించేదే. కొత్త ఆటగాడు షారుక్ ఖాన్ తప్ప ఎవరూ మెరవడం లేదు. ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు డేవిడ్ మలాన్ బెంచ్ కే పరిమితం కావలసి వచ్చింది. ఇప్పుడైనా అతనిని తీసుకొని వస్తే బ్యాటింగ్ మరింత బలోపేతం అవుతుంది.
బౌలింగ్ లో కూడా ఇషాన్ పొరేల్ అనే భారత టాలెంటెడ్ పేసర్ రెండు ఏళ్ళ నుండి బెంచ్ కే పరిమితం అయ్యాడు. విదేశీ ప్లేయర్ల పై ఎక్కువగా ఆధారపడకుండా ప్రభ్ సిమ్రాన్ సింగ్, పొరేల్ లాంటి దేశీ టాలెంట్ పై నమ్మకం పెట్టి పంజాబ్ మేనేజ్మెంట్ పని చేస్తే భవిష్యత్తులో ఫలితాలు వస్తాయి. ఇక తమ చివరి ఐదు మ్యాచ్ లు బ్యాటింగ్ స్వర్గధామమైన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ ఆడనుంది. ఈ లోపు బ్యాటింగ్ మరింత బలోపేతం చేసుకుంటే ఆ మ్యాచ్లలో విజయం సాధించి ప్లే ఆఫ్ వెళ్లే అవకాశాలు ఉంటాయి. లేదంటే ఇంటి బాట పట్టడం ఖాయం.