కనీసం అరడజను మంది టిడిపి ఎమ్మెల్యేలను పార్టీలోకి తెచ్చేసుకుని ప్రస్తుత అసెంబ్లీ లోనే ప్రాతినిధ్యం సంపాదించుకోవడానికి కమల నాధులు తెరవెనుక తీవ్రంగా కృషి చేస్తున్నారట!
ఏపీ పార్టీ చీఫ్ సోము వీర్రాజు ఇదే పనిలో ఉన్నారని సమాచారం.విభజిత ఏపీలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి 2019 ఎన్నికలు చుక్కలు చూపించాయి. 0.84 శాతం ఓట్లు మాత్రమే ఆ పార్టీ కి వచ్చాయి. 2014 లో రెండు లోక్సభ స్థానాలను గెలుచుకున్న బిజెపికి ఈసారి మొండి చెయ్యే ఎదురైంది .అయినా ఆశ చావడంలేదు. మామూలుగా అయితే 2024 ఎన్నికల వరకు బిజెపి ఆగాల్సిందే .ఆ ఎన్నికల్లోనైనా ఎవరైనా గెలిస్తేనే బిజెపి మోజు తీరేది.కానీ 2024 వరకూ బిజెపి వేచి ఉండలేకపోతోందిట. ఇంకా నాలుగేళ్ళ వరకూ అధికార విరహాన్ని ఓపలేనని అంటోంది. అర్జంటుగా ఈ అసెంబ్లీలోనే కమలం కండువాలు కళకళలాడుతూ కనిపించాలిట.మరి నెలలు నిండకముందే డెలివరీ ఎలా అవుతుంది?ఇప్పటికిప్పుడు బిజెపికి ఎమ్మెల్యేలు ఎలా పుట్టుకొస్తారు?అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కానీ అది అలా అలోచించేవారి వెర్రితనమే అవుతుందేమో?ఇపుడున్నది మోడీ, అమిత్ షా లాంటి గండరగండల నాయకత్వంలోని కాషాయదళం. అందువల్ల అర్జంటుగా బీజేపీకి ఏపీలో ఎమ్మెల్యేలను పుట్టించేయగలరు కూడా!ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తమ టార్గెట్ టిడిపి అని చెప్పేశారు.ఈ ప్రకటన లోనే బిజెపి కి ప్రస్తుత అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎలా పుట్టుకొస్తారో సమాధానం ఉంది.కనీసం అరడజన్ మంది టీడీపీ ఎమ్మెల్యేలను అర్జంటుగా బీజేపీలోకి జంప్ చేయించడానికి ఏపీ బీజేపీ ఆరాటపడుతోంది అని ప్రచారం అయితే సాగుతోంది. వైసీపీలో డోర్లు మూసేసిన ఉత్తరాంధ్రా జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలను బీజేపీలోకి తెచ్చేయాలని తెగ తాపత్రయపడుతోంది. వీరు వస్తే ఏపీ అసెంబ్లీలో ఇప్పటికిపుడే బీజేపీ సౌండ్ గట్టిగా వినిపిస్తుంది. ఇది తాత్కాలిక విజయమే అవుతుంది.ఎందుకంటే నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి చేరాక బీజేపీ బలం రాజ్యసభ లో పెరిగిందేమో కానీ గ్రౌండ్ లెవెల్లో అలాగే ఉంది.
ఇక మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి వంటి వారిని చేర్చుకున్నా ఎన్టీయార్ ఓటు బ్యాంకు ఇటు రాలేదు, కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ ప్రెసిడెంట్ గా చేసినా కాంగ్రెస్ నుంచి ఒక్క శాతం ఓటు కూడా ఇటు షిఫ్ట్ కాలేదు. ఆయన సామాజికవర్గం కూడా కన్నెత్తి చూడలేదు. ఇలా ఫిరాయింపులతో ఇంపూ సొంపూ పార్టీకి రాదని అనేక రుజువులు ఉన్నాయి. అయినా కూడా బీజేపీ ఇంకా పాత మోడల్ లోనే వెళ్తోంది.అరువు తెచ్చుకున్న వారితో అసలు సిసలైన రాజకీయం చేయలేమని బీజేపీ నేతలకు ఎప్పుడు అర్థమవుతుందో !