YCP MP Vijaya Sai Reddy: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఎంట్రీ ఇచ్చి పీసీసీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. పీసీసీ పగ్గాలు చేపట్టింది మొదలు అధికార వైసీపీని, సోదరుడు వైఎస్ జగన్ పైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూనే ఉన్నారు.
జగన్ హయాంలో ఏపీలో అభివృద్ధి జరగలేదని, ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోయారని, కేంద్రంలోని బీజేపీకి గులాంగిరి చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. దీంతో షర్మిల వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు. కుటుంబాలను చీల్చి కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తుందని స్వయంగా సీఎం జగన్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలోనూ వైఎస్ షర్మిలను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు వైసీపీ సానుభూతపరులు.
ఈ క్రమంలో తాజాగా వైసీపీ కీలక నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కాంగ్రెస్ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంలో ..ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం ఏనాడూ లేదని, ఇప్పుడు దాన్నొక ఒక ఎన్నికల ఆంశంగా మార్చాలని చూస్తున్నారని అన్నారు.
ఏపీపై కాంగ్రెస్ కు నిజంగా చిత్తశుద్ది ఉంటే విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా చేర్చడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయ్యిందని అన్నారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి బాగా అలవాటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ దుష్టపరిపాలన కు ఏపీ పెద్ద బాధిత రాష్ట్రం అని అన్నారు. ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరని అన్నారు.
గత ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. నీతి లేని రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ దేశంలో కనుమరుగు కావడం ఖాయమని అన్నారు. 2029 లో కూడా తాను ఎంపిగా ఉంటాననీ, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం 2029లో ఒక్క ఎంపీ కూడా ఉండరని విజయసాయి జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు.
YS Viveka Case: సుప్రీం కోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ మరో సారి వాయిదా