వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి రాజ్యసభలో ఈ రోజు అరుదైన అవకాశం లభించింది. ఇటీవలే ఆయన రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ కు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సభను నడిపించే అవకాశం లభించింది. రాజ్యసభ ఫ్యానల్ వైస్ చైర్మన్ హోదాలో గురువారం తొలి సారిగా రాజ్యసభ అధ్యక్ష స్థానంలో కూర్చుని సభా వ్యవహారాలను సాయిరెడ్డి నడిపించారు. రాజ్యసభ లో చైర్మన్, వైస్ చైర్మన్ అందుబాటులో లేని సమయాల్లో వైస్ చైర్మన్ ప్యానల్ లో ఉన్న ఎవరో ఒకరు సభను నడిపిస్తుంటారు.
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇటీవలే రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ ను రీషఫిల్ చేశారు. ఈ సందర్భంలో విజయసాయిరెడ్డికి ప్యానల్ లో చోటు లభించింది. విజయసాయిరెడ్డితో సహా మరో ఆరుగురికి వైస్ చైర్మన్ ప్యానల్ లో తీసుకున్నారు. ఇక లోక్ సభలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్యానల్ స్పీకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇంతకు ముందు పలు సందర్భాల్లో మిథున్ రెడ్డి సభను నడిపించారు. రాజ్యసభలో చైర్మన్ హోదాలో విజయసాయిరెడ్డి సభ నడపడంపై ఆయన అభిమానులు, వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.