YCP MPs: వైసీపీ రాజ్య సభ్యులు బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో భేటీ అయ్యారు. పలు ప్రధాన అంశాలపై మోడీకి వినతి పత్రాన్ని సమర్పించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ, అయోధ్య రామిరెడ్డి లు ప్రధాని మోడీని కలిసి చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు, బీసీ జనగణన, జ్యూడీషియరీలో రిజర్వేషన్ల అమలు, ఆదర్శ గ్రామాలకు నిధులు విడుదల తదితర అంశాలపై వినతి పత్రం ఇచ్చారు. ఆ తరువాత ఏపి భవన్ లో వారు మీడియాతో మాట్లాడుతూ విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నా చట్టసభల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం లేదని అన్నారు. ఓబీసీల అభివృద్ధికి, ప్రణాళిక కోసం ఖచ్చితమైన బీసీ జనాభా లెక్కలు అవసరమని అన్నారు. పార్లమెంట్, శాసనసభ, న్యాయవ్యవస్థల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని అన్నారు.
జ్యూడీషియరీలో రిజర్వేషన్లు అమలు చేయకపోవడం వల్ల సుప్రీం కోర్టులో ఇప్పటి వరకు కేవలం అయిదుగురు ఎస్సీలు మాత్రమే న్యాయమూర్తులుగా నియమితులైయ్యారని వారు పేర్కొన్నారు. స్వాతంత్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా 14 హైకోర్టుల్లో ఒక్క ఎస్సీ జడ్జీ లేరన్న విషయాన్న గుర్తు చేశారు. ఇవన్నీ పార్లమెంట్ లోనూ ప్రస్తావించడం జరిగిందని చెప్పారు. మెజిస్ట్రేట్ కోర్టు నుండి రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.