Bharat Bandh : కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా రేపు దేశ వ్యాప్తంగా బంద్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక దేశ పౌరులంతా ఈ బంద్ విజయవంతం చేయాలని రైతులు వారు విజ్ఞప్తి చేశారు. దాదాపు నాలుగు నెలల నుండి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులందరూ నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో మార్చి 26వ తేదీన ఉదయం 6 గంటలనుండి సాయంత్రం ఆరు గంటల వరకు అఖిల భారత కిసాన్ మోర్చా భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అత్యవసర సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. అయితే ఈ సమస్య మొదలయ్యి ఇప్పటికి నాలుగు నెలలు అవుతున్నప్పటికీ దీనికి ఇప్పటి వరకు పరిష్కారం దొరకలేదు. కేంద్ర ప్రభుత్వం ఎవరో ఒకరిని పంపించడం… ఇరువర్గాలు సంతృప్తి చెందక అవి కాస్తా విఫలం కావడం చూస్తూనే ఉన్నాం.
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి వ్యతిరేకంగా తలపెట్టిన బంద్ కు సంఘీభావం ప్రకటించింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకించడాన్ని వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా రైతు సంఘాలకి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా తమ పూర్తిస్థాయి మద్దతు తెలిపారు. ఇక రాష్ట్ర సమాచార రవాణా శాఖ మంత్రి పేర్ని నాని కూడా ఈ విషయమై సీఎం కేంద్రానికి లేఖ రాసినట్లు వెల్లడించారు. ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా బందు శాంతియుతంగా జరగాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూసుకోవాలని రైతు సంఘాలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీ బస్సుల పై మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట వరకు బంద్ అమలు లో ఉండబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇక వైసిపి తో పాటు టిడిపి, కాంగ్రెస్. కమ్యూనిస్టు పార్టీలు కూడా తమ పూర్తిస్థాయి మద్దతు ప్రకటించాయి. అయితే ఈ బంద్ వల్ల ఏమాత్రం పరిష్కారం దొరుకుతుంది అనేది మాత్రం ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది. వైసిపి మాత్రం క్లియర్ గా తమ స్టాండ్ ను ప్రకటించేసింది.