YS Jagan: వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడుగా పేరున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ ఖరారు చేయకపోవడంతో ఇటీవల వైసీపీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆర్కే ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తొలి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డే. అయితే ఆర్కే మళ్లీ వైసీపీ రానున్నారని వార్తలు వినబడుతున్నాయి. ఇవేళ సీఎం జగన్ ను కలిసే అవకాశం ఉందని అంటున్నారు.
తన సోదరుడు, వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి తో కలిసి ఆర్కే తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్లనున్నారని తెలుస్తొంది. సోదరుడిని తిరిగి పార్టీలోకి తీసుకువచ్చేందుకు అయోధ్య రామిరెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయని అంటున్నారు. ఆర్కే తిరిగి వైసీపీకి వస్తే మంగళగిరిలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఒక వేళ ఆర్కే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తే వైసీపీ ఓట్ల చీలిక ప్రభావం నారా లోకేష్ కు అనుకూలంగా మారుతుందని భావించిన పార్టీ అధిష్టానం .. అయోధ్య రామిరెడ్డిని రంగంలోకి దింపారని సమాచారం.
ఆళ్ల రామకృష్ణారెడ్డి వరుసగా రెండు సార్లు మంగళగిరి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో గంజి చిరంజీవిపై స్వల్ప ఓట్లతో గెలుపొందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి, గత ఎన్నికల్లో నారా లోకేష్ పై విజయం సాధించారు. అయితే మంత్రివర్గంలో తీసుకుంటానని జగన్ ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో చాలా కాలం ఆర్కే ఆసంతృప్తితోనే ఉన్నారు. ఆ తరుణంలోనే మంగళగిరి నియోజకవర్గంలో అభ్యర్ధుల గెలుపు ఓటములను ప్రభావితం చేయగల చేనేత సామాజిక (బీసీ) వర్గానికి చెందిన గంజి చిరంజీవిని టీడీపీ నుండి వైసీపీలోకి చేర్చుకుంది. కొద్ది నెలల క్రితం గంజి చిరంజీవికి వైసీపీ ఇన్ చార్జి బాధ్యతలను అప్పగించింది.
దీంతో మనస్థాపానికి గురైన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆర్కే రాజీనామా చేయడంతో ఆయన అనుచరులు కూడా రాజీనామా చేశారు. ఆర్కే కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదించలేదు. రాజీనామా లేఖపై ఆర్కేకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం లేదు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఓటింగ్ లేదు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసినా నియోజకవర్గంలో వైసీపీకి నష్టం చేకూర్చడం తప్ప గెలిచే అవకాశాలు కష్టమే. అంతిమంగా టీడీపీకి లాభం చేకూరుతుంది.
దీంతో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ద్వారా వైసీపీ రాయబారం నడిపినట్లుగా తెలుస్తొంది. ఆర్కే తిరిగి వెనక్కు వస్తే మరో కీలక పదవి ఇచ్చేందుకు జగన్ సిద్దమైనట్లుగా తెలుస్తొంది. సోదరుడు నడిపిన రాయబారంతో ఆర్కే మెత్తబడ్డారని, తిరిగి వైసీపీలోకి వచ్చేందుకు అంగీకరించారని అంటున్నారు. ఇవేళ జగన్ ను కలిసిన తర్వాత దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆర్కే మళ్లీ వైసీపీకి తిరిగి వస్తే గనుక షర్మిలకు జగనన్న తొలి షాక్ ఇచ్చినట్లే అవుతుందని అంటున్నారు.
Medaram Jatara: భక్తులకు ఉపయోగపడేలా మేడారం జాతర సౌకర్యాలపై మొబైల్ యాప్ రూపొందించిన పోలీస్ శాఖ