YSRCP: చంద్రబాబు అభివృద్ధి చేసి ఉంటే పొత్తులు ఎందుకు అని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెబితే మోసపు మాటలు గుర్తుకు వస్తాయన్నారు. 2014 లో ఇదే కూటమి ఇచ్చిన హామీలు గుర్తున్నాయా అని ప్రశ్నించారు. రైతుల రుణ మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా..? పొదుపు సంఘాల రుణ మాఫీ చేస్తానన్నాడు .. చేశాడా..? ఆడబిడ్డ పుడితే రూ.25వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా..? ప్రతి నగరంలో హైటెక్ సిటీ అన్నాడు .. నిర్మించాడా..? అని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంగా భావించి 99 శాతం హామీలను నెరవేర్చి మళ్లీ మీ ముందుకు వచ్చానని అన్నారు జగన్. మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడాలని జగన్ విజ్ఞప్తి చేశారు.
మేమంతా సిద్దం బస్సు యాత్రలో భాగంగా 9వ రోజు శనివారం కావలిలో నిర్వహించిన సభలో జగన్ మాట్లాడుతూ .. పేదల భవిష్యత్ ను నిర్ణయించేది ఈ ఎన్నికలేనని అన్నారు. మోసగాళ్లంతా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారన్నారు. మోసగాళ్ల కూటమికి వ్యతిరేకంగానే తన పోరాటమని అన్నారు. ఈ ఎన్నికలు జగన్ కు, చంద్రబాబుకు మధ్య జరిగే ఎన్నికలు కావని, పేదలకు, పెత్తందార్లకు మధ్య జరిగే యుద్ధమని పునరుద్ఘాటించారు. మోసగాళ్లంతా చంద్రబాబు పక్షమేనని అన్నారు. ఎన్నికలకు ముందు మ్యానిఫేస్టో చూపించే చంద్రబాబు ఎన్నికల తర్వాత చూపించడని అన్నారు.
చంద్రబాబూ.. మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన నువ్వు నీ మార్క్ అంటూ ఒకటి చెప్పుకోగలవా? అని జగన్ నిలదీశారు. ప్రజలను మభ్య పెడుతూ జనం ముందుకు వచ్చి తాను గతం గురించి చెప్పకుండా అధికారంలోకి వస్తే ఓటేస్తే ఇంటికి కిలో బంగారం, బెంజి కారు ఇస్తానని చెబుతాడని ఎద్దేవా చేశారు. సూపర్ సిక్స్ అంటూ మీ ముందుకు వచ్చే చంద్రబాబును చూసి నమ్మలా? అని జగన్ ప్రశ్నించారు. మోసం, వెన్నుపోటు, కుట్ర, అబద్ధం అన్నీ కలిపితే చంద్రబాబు అని అన్నారు. మంచి చేస్తేనే వైసీపీకి ఓటు వేయమని తాను అడుగుతున్నానని అన్నారు.
YS Sharmila: వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి పై వైఎస్ షర్మిల ఆగ్రహం