కవులు ఎల్లప్పుడూ ఉద్యమాలూ పోరాటాలు సాగాలని కోరుకోరు. ఆత్మహత్యల పాలయ్యేవారు..అత్యాచారాలకు గురయ్యేవారు..అన్యాయాలకు బలయ్యేవారు..ఉన్మాదుల పాదాల కింద చీమల్లా నలిగిపోయేవారు ఎప్పుడూ ఉండాలని అక్షర ప్రేమికులెవ్వరూ కాంక్షించరు. యుద్ధాలు కావాలని కవులు కలలుగనరు. వారి మనసెప్పుడూ ప్రకృతి..ప్రణయం.. సున్నితమైన మానవ సంవేదనలు..తాత్విక విషయాలు వగైరా వగైరాలతో పెనవేసుకుని వుంటుంది. చాలా ప్రయివేటు సందర్భాలలో మనం పద్యాలు పాడుకుంటాం. కరుణశ్రీనో..కృష్ణశాస్త్రినో..జాషువానో..నండూరినో నెమరేసుకుంటాం. జీవితమెప్పుడూ ఉత్సవంగా సాగాలనేదే కవి తపన..తపస్సు. కళ అంతిమ లక్ష్యం జీవనానందమే. అయితే కళ్ళముందు కదలాడుతున్న పరిస్థితులు కవుల్ని రచయితల్నీ కళాకారుల్నీ మరో వైపు అనివార్యంగా లాగుతాయి. కళ్ళుంటే చూసేవాడు..వాక్కుంటే రాసే వాడు తన ముందున్న దృశ్యాల నుండి వెనుదిరగలేడు. ఇప్పుడు దేశం కవుల్నీ కళాకారుల్నీ నిలదీస్తోంది. మీరేం చేస్తున్నారు? మీరేం రాస్తున్నారు? అని నిగ్గదీస్తోంది. బోనులో నిలబడ్డ ప్రతి కళాకారుడూ మేధావీ దీనికి సమాధానం ఇవ్వాల్సిందే.
ఒక ఉర్దూ కవిని ఈ వారం మీకు పరిచయం చేస్తాను. ఆయన ఒక సైంటిస్టు. ఆయనకు ప్రేమ కవిత్వమన్నా..ప్రకృతి కవిత్వమన్నా మహా ఇష్టం. కానీ తనను పరిస్థితులు నిరసన కవిగా మలచాయని అంటాడు. అతని పేరు గౌహర్ రజా.
‘’ నేను పూలు పూయించాలనుకుంటాను
వారు నా వైపు శిశిర వాయువుల్ని విసురుతారు
నేను పాటలు పాడాలనుకుంటాను
వారు నా గుండెకు నిప్పంటిస్తారు. ‘’ అంటాడు రజా.
అరవయ్యేళ్ళ రజా, దేశంలో పరిస్థితుల్ని చూసి నిప్పులు కక్కుతున్నాడు. కల్బుర్గి, గౌరీ లంకేష్, రోహిత్ వేముల వంటి అనేక మంది హత్యలు ఆత్మహత్యలు ఆయన్ని కలిచివేస్తున్నాయి. మూక దాడులు..మూక హత్యలు వేటాడుతున్నాయి. మతం మత్తు మందే కాదు అది అమాయకుల రక్తం తాగే ఒక మహారాకాసిగా అతనికి కనిపిస్తోంది. చట్టసభల్లో మతం నినాదమైందని ఆందోళనపడుతున్నాడు. హంతకుల చేతుల్లో దేశం జెండా ఎగురుతోందని భయపడుతున్నాడు. ఉన్నావ్ బాధితురాలి దు:ఖ గాథ మనకు తెలుసు. అధికార పార్టీ నాయకుడు అత్యాచారం చేస్తే శిక్ష బాధితురాలు అనుభవిస్తున్న అతి కిరాతక విషాదాన్ని మనం చూశాం. ఆ బాధితురాలికి అంకితమిస్తూ ఆయన రాసిన ఒక కవిత సోషల్ మీడియాలో ఒక సంచలనమైంది. ఆ కవిత చూడండి
‘’ ఒక కుట్ర దుర్ఘటనగా మారితే / కుట్రదారులు పాలకులైతే/ ప్రజాస్వామ్యం హత్యచేయబడుతుంటే/హంతకుల చేతుల్లో దేశం జెండా ఎగురుతుంటే/ విద్రోహుల గళసీమల్లో పూలమాలలు పడుతుంటే/ విద్వేష రాజకీయ కీలల్లో బలహీనులు బలైపోతుంటే/ రేపిస్టులను చూసి రాజసింహాసనం గర్వపడుతుంటే/ హంతకుడు జైల్లో సకల భోగాలు అనుభవిస్తుంటే/ గౌరవ నాగరికులను బలివేదికలెక్కిస్తుంటే/ గుంపు వేషం ద్వేషమైతే /చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వీధుల్లో గుంపులు వీరంగం వేస్తుంటే/ చట్టసభల్లో మతం మహానినాదమై మార్మోగుతుంటే/ ఒక మందిరంగానో మసీదుగానో చర్చిగానో అన్ని గుర్తింపులూ కుంచించుకుపోతుంటే/ దొంగలు స్వేచ్ఛగా విహరిస్తుంటే/ అభాగ్యుల నిరుపేద వాడలు బూడిదవుతుంటే /నిరుద్యోగ యువత ఖాళీ చేతుల్లో కత్తులు పెడుతుంటే /
అర్థం చేసుకోండి..
ఘటన ప్రతిదీ మరొకదానితో ముడిపడి వుందని../ అది మతం పేరు మీద సాగుతున్న కుట్ర అని/ ఆ కుట్ర తీవ్రాతి తీవ్రమైందని/ చివరికి ఇంకా అర్థం చేసుకోవాలి.. మతం పేరుతో సాగుతున్నదంతా మతం కాదని/ మన సంస్కృతిని ముట్టడించిన ముప్పు అని/ అందుకే లేవండి..!
సంస్కృతిని సంరక్షించుకుందాం ..!అది మన ధర్మం..మన కర్తవ్యం’’
చూశారా రజా నిరసన ఎంత తీవ్రంగా వ్యక్తమయిందో. గౌహర్ రజా ఇటీవలనే శాస్త్ర పారిశ్రామిక పరిశోధన మండలిలో ఛీఫ్ సైంటిస్టుగా రిటైరయ్యారు.ఆయన డాక్యుమెంటరీ నిర్మాతగా కూడా ప్రసిద్ధుడు. ఆయన తీసిన భగత్ సింగ్ డాక్యుమెంటరీ, 2002 గుజరాత్ మారణకాండ డాక్యుమెంటరీ చాలా పాపులర్ అయ్యాయి. కవి పని కేవలం కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలనో..హింసనో కవిత్వంలో రికార్డు చేయడం కాదు. పాఠకుడి ముందు ఓ ప్రత్యామ్నాయ ప్రపంచాన్ని ఉంచాలి. అంటాడు రజా.
ఒక్క రజా మాత్రమే కాదు. ఎందరో కవులు ఇప్పుడు నిరసన స్వరాలు అల్లుతున్నారు. రొమాంటిక్ పోయెట్ గా పేరున్న గుల్జార్ కూడా తన నిరసన వినిపిస్తున్నాడు.
‘’ మరోసారి మెడలు వాలిపోయాయి/ తలలు తెగిపడుతున్నాయి/ మనుషులు విడిపోతున్నారు/
వాళ్ళ దేవుళ్ళు కూడా-/ నా పేరు అడిగితేనే నాకు భయం వేస్తోంది/ ఎవరిని పూజించాలో నాకు కలవరంగా వుంది/ కొద్దిమంది నన్నుఎన్నిసార్లు బలివేదిక మీద నిలబెట్ట లేదు?’’ ఇది కేవలం గుల్జార్ భయమే కాదు. ఆలోచనాపరులందరి భయమూ ఇదే.
నిరసన ఒక్కటే ఇప్పుడు మన ఆయుధంగా మిగిలింది. నిరసన ఒక్కటే మనకు చివరి ఆశ్రయంగా మారింది. నిరసనే ఊపిరిగా నిరసనే నిద్రగా నిరసనే మెలకువగా నిరసనే ఆహారం నిరసనే ఆహార్యంగా తర్జుమా అయింది. కల్లోల సందర్భంలో కవిత్వం రాసే ఏ కవికైనా ఇప్పుడిదే అనుభవంగా నిలిచింది. ఏ చెట్టు మీదో రెండు పక్షుల్ని చూసినప్పుడో..ఏ రెమ్మకో పూచిన రెండు పూలను తాకినప్పుడో..వెన్నెలలో తడిసినప్పుడో..వెచ్చని సాయం సంధ్యాకాశపు నీరెండ నీడతో మన నీడ ముచ్చట పెట్టినప్పుడో కవిత్వం పొంగుకొస్తుంది. కాని ఇప్పుడు కవి చేయి పట్టి దేశం రాయిస్తున్న గీతం వేరు. అది నిరసన గీతం. ఇది నిరసన రుతువు. ఈ తరం కవులు, కళాకారులు ఈ సందేశాన్ని అగ్నిలాంటి వారి ఆత్మలతో అందుకోవాలి.
డా.ప్రసాదమూర్తి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ