హైదరాబాద్: అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ రెండు కోట్ల రూపాయల వ్యవహారంలో సినీ నటుడు, రాజమహేంద్రవరం టిడిపి ఎంపి మాగంటి మురళీ మోహన్పై కేసు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సజ్జనార్ మాట్లాడారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో 21 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని సజ్జనార్ చెప్పారు. పోలీసుల తనిఖీల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు తమకు అనుమానాస్పదంగా కనిపించారనీ, దీంతో వారి వాహనంలో సోదాలు నిర్వహించామనీ ఆయన అన్నారు. ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి రెండు కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
ఈ నగదును తీసుకెళుతున్న వ్యక్తులను నిమ్మలూరి శ్రీహరి, ఆరుటి పండరిగా గుర్తించామని తెలిపారు. వీరిద్దరూ జయభేరి కంపెనీలో పనిచేస్తున్నారన్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా రెండు కోట్ల రూపాయల నగదును రైలు ద్వారా తరలించేందుకు వీరు ప్రయత్నించారని సజ్జనార్ పేర్కొన్నారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ నుంచి ఎంఎంటిఎస్లో సికింద్రాబాద్కు, అక్కడి నుంచి రైలులో రాజమహేంద్రవరం వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు.
రాజమహేంద్రవరంలో యలమంచిలి మురళీ కృష్ణ అనే వ్యక్తి మీ కోసం ఎదురు చూస్తుంటాడనీ, ఆయన కారులో ఈ డబ్బులు తీసుకెళ్లి ఎంపి మాగంటి మురళీ మోహన్కు ఇవ్వండనీ జయభేరి సంస్థకు చెందిన ధర్మారాజు, జగన్మోహన్ చెప్పినట్లు నిందితులు శ్రీహరి, పండరిలు అంగీకరించారని సజ్జనార్ తెలిపారు.
ఈ నేపథ్యంలో టిడిపి ఎంపి మురళీ మోహన్, యలమంచిలి మురళీ కృష్ణ, జగన్మోహన్, ధర్మరాజు, పండరి, శ్రీహరిలపై కేసు నమోదుచేశామని సజ్జనార్ తెలిపారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 171బీ, 171ఈ, 171సీ, 171 ఎఫ్ కింద కేసు నమోదు చేశామన్నారు.
మురళీ మోహన్ కోడలు మాగంటి రూప రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.