ఢిల్లీ, జనవరి 24: సిబిఐ కొత్త బాస్ ఎవరన్న ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. కొత్త చీఫ్ను ఎంపిక చేసే హైలెవల్ కమిటీ ఈ రోజు సమావేశం కానుంది. హైలెవల్ కమిటిలో ప్రధాని నరేంద్ర మోది, ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గె, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్లు ఉన్నారు.
అలోక్ వర్మను సిబిఐ చీఫ్ పదవి నుండి తొలగించిన తరువాత ఎం. నాగేశ్వరరావును తాత్కాలిక డైరక్టర్గా నియమించారు. ఆ నియామకంపై సుప్రీంకోర్టులో దాఖలయిన పిటిషన్ల విచారణ ఈ రోజు వాయిదా పడింది. జస్టిస్ సిక్రీ విచారణ ధర్మాసనం నుంచి తప్పుకోవడంతో ఈ వాయిదా అనివార్యమయింది. ఆ పిటిషన్ల భవిష్యత్తు తేలకముందే పూర్తి కాలపు డైరక్టర్ ఎంపిక నేడు జరగనుంది..
సెంట్రల్ విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా 1982 – 1985 మధ్య ఐపిఎస్ బ్యాచ్లనుండి సిబిఐ కొత్త బాస్ను ఎంపిక చేయనున్నారు.
కొత్త సిబిఐ డైరెక్టర్ పదవి కోసం ప్రధాని కార్యాలయం 12మంది అధికారుల జాబితాను సిద్ధం చేసింది.
ప్రస్తుతం గుజరాత్ డిజిపిగా ఉన్న శివానంద్ ఝా, బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రజనీకాంత్ మిశ్రా, సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ రంజన్, ఎన్ఐఎ డైరెక్టర్ జనరల్ వైసీ మోది, ముంబై పోలీస్ కమిషనర్ సుబోధ్ జైశ్వాల్లు రేసులో ముందు వరుసలో ఉన్నారు.