హమ్మయ్య టీడీపీలో ఓ తతంగం పూర్తయింది..! చాలా కాలంగా ఓ డోలు పట్టుకుని.., ఎవరి మేడలో కట్టాలా అని ఎదురు చూసిన చంద్రబాబుకి అచ్చెన్నాయుడు దొరికారు. వేశారు. ఇక చిన్నా చితక గంటలన్నీ పిల్లులకు కట్టేశారు..! ఇదేదో టీడీపీని కించపరచడానికో.., చంద్రబాబుని తక్కువ చేయడానికో చెప్తున్న మాటలు కాదండోయ్..! ఆ పార్టీ ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా అలా చెప్పుకోవాల్సిందే..!! ఇక ఆ డోలుని అచ్చెన్న ఎన్నాళ్ళు వాయిస్తారో..? ఆ పిల్లులు మేడలో గంటలతో ఎన్నాళ్ళు నెట్టుకొస్తాయో..? అన్నీ కలిసి ఎప్పుడు తమ యజమానిని (అధినేతని) కుర్చీ ఎక్కిస్తాయో..!?
బాబు మర్మం మామూలు కాదు సుమీ..!!
చంద్రబాబు అంటే ఒక కన్నింగ్. అందరూ అపర చాణక్యుడు, అపార వ్యూహకర్త అంటుంటారు కానీ.., వాస్తవానికి ఆయన బీభత్సమైన కన్నింగ్. ఒక నిఖార్సయిన పొలిటిషన్. ఇంకా చెప్పుకోవాలంటే పొలిటికల్ వంటగాడు. కూరల్లో కరివేపాకుల్ని కూడా అయన ఎలా వాడాలో తెలుసు..! ఉన్నట్టుండి అచ్చెన్నాయుడికి అధ్యక్ష పగ్గాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది..? అనేది ఆలోచించాల్సిన విషయమే కదా..!! ఒకవేళ.., అచ్చెన్నాయుడు కూడా అందరు ఎమ్మెల్యేల్లాగా సైలెంట్ గా ఉంటే ఆయనకు అధ్యక్ష పదవి దక్కేదా..? అచ్చెన్న జైలుకి వెళ్లకపోతే.., ఆయనకు అధ్యక్ష పదవి వచ్చేదా..? అచ్చెన్నాయుడుపై ఒకవేళ సానుభూతి రాకుంటే., బీసీగా పార్టీకి ఉపయోగపడకుంటే ఆ పదవి ఇచ్చేవారా..? ఇన్ని ఉన్నాయి కాబట్టే అచ్చెన్నాయుడికి ఆ కిరీటం దక్కింది. దాని చుట్టూ ముళ్ళున్నాయి.
* ఇన్ని మాటలు ఎందుకు..? టీడీపీని నిందిస్తున్నాము అనుకుంటారేమో..!! ఒక్క పాయింటు చాలు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రబ్బర్ స్టాంప్ లా ఉంటూ, పెద్దగా ప్రభావం చూపని కళా వెంకట్రావుకి పగ్గాలు ఇచ్చారు. అప్పుడు పార్టీకి బలమైన నాయకత్వం అవసరం లేదు. అధికారం ఉంది కాబట్టి.., గట్టి నాయకుడు అధ్యక్షుడుగా ఉంటే లోకేశుడు అనే నాయకుడి ఆటలు సాగవు. కానీ ఇప్పుడు లోకేశు ఆట, మాట, బాట ఏదీ సాగట్లేదు. జగన్ సాగనీయట్లేదు. అందుకే ఇక షాడో అధ్యక్షుడు కాకుండా డైరెక్ట్ గా పని చేసే దూకుడైన నాయకుడు కావాల్సి వచ్చింది. అందుకే అచ్చెన్నకు ఈ ముళ్ళ కిరీటం దక్కింది. ఈయన కూడా జైలుకి వెళ్లి వచ్చే వరకు.. ఆ పదవి ఇవ్వాలనే ఆలోచన కూడా బాబుకి లేదు. కానీ సానుభూతి, బీసీ కార్డు, దూకుడు అన్నీ కలిసి వచ్చి బాబుగారి కన్నింగ్ కి పని పడింది. సో.., అలా అచ్చెన్నాయుడు అధ్యక్షుడు అయ్యారోచ్చ్..!!
పదవుల్లో పదనిసలు..!!
అంతే కాదు. పదవుల్లో కొన్ని పదనిసలు దాక్కున్నాయి. పొలిట్ బ్యూరో నుండి ఇటీవల రాజీనామా చేసిన గల్లా అరుణ కుమారిని.. జాతీయ ఉపాధ్యక్షురాలిని చేశారు. ఆమె తనయుడుఎం, గుంటూరు ఎంపీ జయదేవ్ ని పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. పార్టీలో ఉంటారో వెళ్తారో తెలియని పితాని సత్యన్నారాయనని కూడా పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. పొలిటికల్ సెక్రెటరీగా తేదీ జనార్దన్ ని ఉంచారు. పెద్దగా ఇతర మార్పులు లేనప్పటికీ తెలంగాణ అధ్యక్షుడిగా మాత్రం రమణని కొనసాగించారు. దీనిలోనూ మర్మం ఉంది. అక్కడ పార్టీ అధ్యక్షుడిగా ఎవ్వరూ ముందుకు రాక.., మరో దిక్కు లేక.., రమణని ఉంచారు. ఇక రాష్ట్ర కమిటీలో చోటు ఉంటుంది అనుకున్న అనగాని సత్య ప్రసాద్, చింతమనేని ప్రభాకర్, డోలా బాల వీరాంజనేయ స్వామిలకు చోటు దక్కలేదు.