రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు పునాదులు వేశారు. దానిపై జగన్ బిల్డింగ్ కడుతున్నారు. ఇదేదో అభివృద్దికో అనుకునేరు.. అప్పులకు..! రాష్ట్రాన్ని అప్పులకొండగా మార్చడంలో చంద్రబాబు ఒకస్థాయికి తీసుకెళ్తే.. జగన్ మరో స్థాయికి తీసుకెళ్తున్నారు. పోటాపోటీగా సంక్షేమ పథకాలు.. జేబులో డబ్బులు పెట్టే పథకాలు ప్రవేశపెట్టడంతో ఏపీకి అప్పులు తిప్పలు తప్పడం లేదు. రాష్ట్రం అప్పులు చేసే స్థాయి కూడా దాటిపోయిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ అప్పుల జాతరపై జగన్ ప్రభుత్వం ముందు ముందు ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.
ఆశించింది ఎక్కువ.. వచ్చింది తక్కువ
ప్రస్తుతం రాష్ట్రం అప్పులపైనే నడుస్తోందనేది నిర్వివాదాంశం. మొదటి ఆరు నెలల్లో రెవెన్యూ కంటే అప్పులే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సవం తొలి అర్ధభాగంలో రెవెన్యూ రూ.44 వేల 915 కోట్లు ఉంటే… అప్పులు రూ. 55 వేల 169 కోట్లు ఉన్నాయి. ఏడాదిలో రూ.1,61,958.50 కోట్ల ఆదాయం సమీకరించే విధంగా బడ్జెట్లో అంచనాలు వేశారు. కానీ.. మొదటి ఆరు నెలల్లో కేవలం 27.73శాతం మాత్రమే సాధించారు. కేంద్రం సాయం కూడా నాలుగో వంతు మాత్రమే వచ్చింది. రాష్ట్రం చేసిన ఖర్చులో సగం కన్నా ఎక్కువ మొత్తం అప్పు రూపంలోనే ఉంది. ఈ లెక్కలను పరిశీలిస్తే రాష్ట్ర ఆదాయం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ఏపీకి కేంద్ర సాయం కూడా అంతంతమాత్రంగానే దక్కడంతో ఏపీ వేసుకున్న లెక్కలకు, రాబడికి ఖర్చుకు సంబంధం లేకుండా పోయింది.
ఇలాగే ముందుకెళ్తే ఎలా..
ఈ పరిస్థితుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ముందు ముందు మరిన్ని సవాళ్లు ఎదురుకాబోతున్నాయని చెప్పాలి. అప్పులు తెచ్చుకునే వెసులుబాటు పెంచుకుందంటేనే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూనే కొత్త పథకాలు కూడా ప్రవేశపెట్టారు. బహుశా.. దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మొత్తంలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం లేదని చెప్పాలి. మరి జగన్ ఇదే తరహాలో వెళ్తే ఖజానాపై మరింత భారం పడుతుందని అంటున్నారు. సీఎంగా జగన్ ఎలా ఆలోచిస్తారో.. ముందుకెళ్తారో చూడాలి.