(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అధికార, ప్రతిపక్ష నేతల తిట్ల పురాణానికి కేంద్రంగా మారిందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు విమర్శించారు. సిఐటియూ రాష్ట్ర సభలకు హజరైన బివి రాఘవులు మీడియా సమావేశంలో ఏపి అసెంబ్లీ జరుగుతున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభను చూస్తే అది ప్రజలకు ప్రాతినిధ్యం వహించే సభలా కనిపించడం లేదనీ, వ్యక్తుల తిట్ల పురాణ సభగా మారిపోయిందనీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామం దురుదృష్టకరమని రాఘవులు అన్నారు.
టిడిపి తన ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహించడం లేదని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ప్రతిబంబించేలా వ్యవహరించాల్సిన టిడిపి ఆ విషయంలో చాలా వెనుకబడిందని అన్నారు. దీనిని పాలకపక్షం అనుకూలంగా మార్చుకుందని ఆయన పేర్కొన్నారు. అధికార పార్టీ చేసే తప్పుడు విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, అప్రజాస్వామిక పనులను సులభంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని రాఘవులు అన్నారు. నాడు టిడిపి, నేడు వైసిపి రాష్ట్రంలో పాలనను గాలికి వదిలివేసినట్లుగా ఉందని పేర్కొన్నారు. నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తరువాత వేగంగా అభివృద్ధి చెందుతుందని భావించామనీ కానీ గతం కన్నా వెనుకబడిపోయిందనీ రాఘవులు వ్యాఖ్యానించారు.
వైసిపి, టిడిపిలు రాష్ట్రంలో ఒకలా, కేంద్రంలో మరోలా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఈ రెండు పార్టీలు కేంద్రంలో బిజెపితో జతకట్టడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని రాఘవులు అన్నారు.