(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం జగన్ కశ్చితంగా ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్న వాళ్లలో ముందు వరుసలో ఉన్న ఎమ్మెల్యే కొండా సురేఖ. వైఎస్ రాజశేఖరరెడ్డి వీరవిధేయురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కొండ దంపతులు వైఎస్ మరణం తరువాత జగన్కు అంతకంటే వీర విధేయులుగా మారారు. అప్పట్లో శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు.జగన్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుని సంతకాల సేకరణ చేసిన వాళ్లలో వీళ్ళు ముందు వరుసలో ఉన్నారు. అంటే జగన్కు ఎవరైనా రాజకీయాల శ్రేయోభిలాషులు ఉన్నారంటే మొదట్లో కొండా సురేఖ దంపతుల పేరే వస్తుంది. అటువంటి కొండా సురేఖ తాజాగా జగన్మోహనరెడ్డి పరిపాలనపైన, జగన్కి, కెసిఆర్ మధ్య బంధాలపైన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఒకప్పుడు జగన్పై రాళ్ళు రువ్వంచిన కేసీఆర్కు అదే జగన్పై ఇప్పుడు ప్రేమ ఏలా పుట్టింది ? జగన్ ఏలా తీపి అయ్యారు. జగన్ కేసీఆర్ పదే పదే ఎందుకు సమావేశ మవుతున్నారు ! ఇందులోని ఆంతర్యమేమిటి అంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొండా సురేఖ కేసీఆర్ – జగన్ దోస్తీపై చేసిన సంచలన వాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. వైఎస్ హయాంలో వైఎస్ కు సనిహితంగా ఉన్న నాయకులలో కొండా సురేఖ ఒకరుగా ఉన్నారు. వైఎస్ మరణం అనంతరం కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి జగన్ తో కలసి ప్రయాణం చేశారు. తెలంగాణ వరంగల్ కు చెందిన సురేఖ ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత కేసీఆర్ చెంతన చేరారు. అక్కడ కూడా తగిన ప్రాధాన్యం దక్కక పోవడంతో తిరిగి సొంత గూడు అయిన కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా ఒక న్యూస్ చానల్కు ఇచ్చిన ఇంటర్యూలో కేసీఆర్..జగన్ సత్సంబంధాలపై చేసిన సంచలన వ్యాఖ్యలు చర్చానీయాంసంగా మారాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్పై అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు కేసీఆర్కు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. ఇప్పుడు జగతో పదే పదే అనధికారంగా కలుస్తున్నారు ఎందుకని? అందులోని ఆంతర్యం ఏమిటి? అనే సందేహాన్ని వెలిబుచ్చారు కొండ సురేఖ.
జగన్ పాలన కక్ష సాధింపులా ఉంది !
జగన్ పాలనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనకు చాలా తారతమ్యం ఉందని కోండా సురేఖ వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి పాలన అందిచాల్సింది పోయి తెలుగుదేశం నాయకులపై కక్ష సాధిస్తున్నారని విమర్శించారు. జగన్ పాలనలో కక్ష సాధింపు కనబడుతుందనీ, అది మంచిది కాదనీ కొండా సురేఖ హితువు పలికారు. రాజకీయం ఎన్నకల వరకే ఉండాలి ఆ తరువాత అందరిని సమానంగా చూడాలని కొండా సురేఖ పేర్కొన్నారు.