విజయవాడ, జనవరి 18: జగన్పై దాడి కేసులోని నిందితుడు శ్రీనివాసరావును శుక్రవారం ఎన్ఐఎ అధికారులు విజయవాడ ఎన్ఐఎ కోర్టులో హజరుపర్చారు. కోర్టు అనుమతితో శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న ఎన్ఐఎ అధికారులు ఆరు రోజుల పాటు విచారణ జరిపారు. కస్టడీ గడువు ముగియడంతో శుక్రవారం నిందితుడిని కోర్టులో హజరు పరిచారు.
న్యాయమూర్తి ముందు శ్రీనివాసరావు మాట్లాడుతూ, తన మనసులోని మాటలు ప్రజలకు తెలియజెప్పే అవకాశం కల్పించాలని కోరాడు. జగన్పై ఎందుకు దాడి చేసిందీ తాను జైలులో రాసుకున్నాననీ, ఆ 22 పేజీలను జైలు అధికారులు లాక్కున్నారని ఆతను చెప్పాడు. వాటిని ఇప్పించాలని న్యాయమూర్తిని నిందితుడు శ్రీనివాసరావు వేడుకున్నాడు.
ఎన్ఐఎ అధికారులు కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి 30గంటల పాటు తాము లేకుండానే రహస్యంగా విచారణ చేశారని నిందితుడి తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఎన్ఐఎ అధికారుల విచారణ పూర్తి అయినందున శ్రీనివాసరావును విజయవాడ జైలుకు తరలించే అవకాశం ఉంది. జైలులో నిందితుడికి పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని న్యాయవాదులు కోరారు.
విజయవాడ సబ్ జైలులో భద్రత కల్పించలేమని అధికారులు చెబుతున్నట్లు సమాచారం. రాజమండ్రి లేదా వైజాగ్ జైలుకు తరలించే అవకాశం ఉందని భావిస్తున్నారు.