Munugode Bypoll 2022: మునుగోడు ఉప ఎన్నికలను ప్రధాన రాజకీయ పక్షాలు అన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఓ పక్క ఓటర్లను ఆకట్టుకునేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూనే ప్రత్యర్ధి పార్టీల్లోని అసమ్మతి నేతలను తమ పార్టీలోకి చేర్చుకునే పనిలో మంత్రాంగాలు సాగిస్తున్నాయి. ఎన్నికల సమయంలో జంపింగ్ జిపాంగ్ లు సర్వసాధారణమే. అధికార టీఆర్ఎస్, బీజేపీ ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. టీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న మాజీ ఎంపీ బూర నర్సయ్య ఆ పాార్టీకి షాక్ ఇస్తూ రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే టీఆర్ఎస్ అదే సామాజికవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధి కుటుంబాన్ని తమ పార్టీలో చేర్చుకుని రాజకీయ చతురత ప్రదర్శించింది.
మునుగోడు నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గ ఓట్లు అధికం కావడంతో ఇటు టీఆర్ఎస్ నుండి బూర నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ నుండి పల్లె రవికుమార్ లు ఆయా పార్టీల నుండి టికెట్లు ఆశించారు. అయితే బీజేపీ తరపున రెడ్డి సామాజికవర్గానికి చెందిన బలమైన నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ లు ఆ సామాజికవర్గానికి చెందిన పాల్వాయి స్రవంతి, కాసుగుండ్ల ప్రభాకరరెడ్డిలను అభ్యర్ధులుగా నిలిపాయి. దీంతో ఆ రెండు పార్టీల్లో టికెట్లు ఆశించి భంగపడిన బూర నర్సయ్య గౌడ్ (టీఆర్ఎస్), పల్లె రవికుమార్ (కాంగ్రెస్) అసంతృప్తికి లోనయ్యారు. ఇదే అదునుగా బీజేపీ పావులు కదపడంతో బూర నర్సయ్య టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. టీఆర్ఎస్ లో బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి భంగపడిన పల్లె రవికుమార్ పై అధికార టీఆర్ఎస్ దృష్టి పెట్టి మంత్రాంగం నడిపి సక్సెస్ అయ్యింది.
పల్లె రవికుమార్, ఆయన భార్య కళ్యాణి లు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటిఆర్ సమక్షంలో వీరు గులాబీ కండువాలు కప్పుకున్నారు. గతంలో జర్నలిస్ట్ గా పని చేసిన పల్లె రవికుమార్ తెలంగాణ ఉద్యమ సమయం నుండి రాజకీయాల్లోకి ప్రవేశించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ఆయన భార్య కళ్యాణి చండూరు మండల పరిషత్ చైర్ పర్సన్ గా గత ఎన్నికల్లో గెలిచి కొనసాగుతున్నారు. పల్లె రవి దంపతులను మంత్రి కేటిఆర్ టీఆర్ఎస్ లోకి అహ్వానించారు. ఈ సందర్భంలో చండూరును రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలన్న ప్రజల డిమాండ్ ను రవికుమార్ ..కేటిఆర్ దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తొంది. పార్టీలోనూ సముచిత గౌరవం కల్పిస్తామని వారికి కేటిఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం.
మునుగోడు ఉప ఎన్నికల వేళ టీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్