NT Ramarao: ఎన్టీఆర్.. విశ్వనటుడు.. దేశం చూడదగ్గ నటుడు.., తెలుగు జనం గర్వించదగ్గ హీరో.. వెండితెరపై ఆయనో ఇలవేల్పు.. నిస్సందేహంగా ఎన్టీఆర్ ఒక బ్రాండ్.. ఒక తెలుగు జాతి రత్నం..! కానీ రాజకీయ రత్నమా..? ఆయన నట రత్నమా..? రాజకీయ రత్నమా..? రాజాకీయ రత్నమే అయితే 1989లో ఎందుకో ఘోరంగా ఓడిపోయారు..? ఒకసారి మాత్రమే పూర్తిస్థాయిలో సీఎంగా చేసి, వెంటనే ప్రజల్లో అసంతృప్తి ఎందుకు మూటగట్టుకున్నారు. 1985 నుండి 1989 మధ్య ఆయన రాజకీయం/ పరిపాలన ఎలా సాగింది..? నిజానికి ఆయన రాజకీయం ఎప్పుడు., ఎందుకు.., ఏ పరిస్థితుల్లో మొదలయింది.!? ఎవరి కోసం మొదలయింది.. ఇవన్నీ కొంచెం లోతుగా ఆలోచిస్తే ఎన్టీఆర్ లోపలి మనిషి కూడా తెలుస్తారు. ఆయన జయంతి సందర్భంగా తెలుగు రాజకీయాలను ఆరోజుల్లో ఎలా ఉండేవో ఓసారి గుర్తు చేసుకుందాం..
Must Read: కారణ జన్ముడు ఎన్టీఆర్..! ప్రత్యేక కథనం
NT Ramarao: పార్టీ పెట్టడానికి కారణాలు..!?
తెలుగు దేశం పార్టీ 1982 మార్చి 29న ఆవిర్భవించింది. అప్పటికి ఎన్టీఆర్ 292 సినిమాల్లో నటించారు. రాజకీయాల్లోకి రాకముందు అయిదేళ్లలో వరుసగా కమర్షియల్ హిట్స్ కొట్టారు. యమగోల, డ్రైవర్ రాముడు, అడవి రాముడు, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, జస్టిస్ చౌదరి లాంటి మాంచి మాస్ మసాలా సినిమాలు చేసారు. కుర్రాడిలా ఆడిపాడారు. చివరికి హీరోగా మంచి పేరు ఉన్నప్పుడే రాజకీయ ప్రవేశం చేయాలని 1982లో పార్టీ పెట్టారు. కానీ దీనిలో మూల కారణాలు కొన్ని ఉన్నాయి.
* ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కుల రాజకీయాలు అనుకుంటున్నారేమో.. దశాబ్దాలకు ముందే ఈ కుల రాజకీయాలున్నాయి. 1977లో ఎమెర్జెన్సీ సమయంలో ఏపీలో కులాల మధ్య కూడా చిచ్చు వచ్చింది. అప్పటికి ఉమ్మడి ఏపీలో రెడ్డి సామజిక వర్గం ఓట్లు శాతం 12 వరకు ఉండగా., కమ్మ సామాజికవర్గం ఓట్లు శాతం 11 శాతం ఉండేవి. రెడ్డి సామాజికవర్గంలో చాలా మంచి కాంగ్రెస్ లో సెటిల్ అయ్యారు. కమ్మ సామాజికవర్గంలో ఎక్కువగా కమ్యూనిస్టుల కోటాలోనే ఉండేవారు. అయితే కమ్యూనిస్టుల పార్టీలో రెడ్డిల వాటా కూడా ఉండేది.
* 1978 లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. అప్పట్లో దేశం మొత్తం మీద కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో ఇందిరతో విభేదించి కాసు బ్రహ్మానందరెడ్డి ఏపీలో రెడ్డి కాంగ్రెస్ అనే పేరుతో ఒక పార్టీ ఏర్పాటుచేసారు. ఆ ఎన్నికల్లోనే కొందరు రెడ్డి నేతలు రాజకీయాల్లో వచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాజకీయ ప్రవేశం చేసి పులివెందుల నుండి మొదటిసారి భారీ మెజారిటీతో గెలిచారు.
* రెడ్డి కాంగ్రెస్ మళ్ళీ అసలైన కాంగ్రెస్ లో కలిసిపోయింది. కానీ కమ్యూనిస్టుల్లో కదలిక వచ్చింది. కమ్మ సామాజికవర్గంలో కదలిక వచ్చింది. తమకు ఒక ప్రత్యేక రాజకీయ పార్టీ ఉంటె బాగుంటుంది అనే చర్చ మొదలయింది. అలా వారికి కనిపించిన వ్యక్తి.. అప్పటికి సినిమాల ద్వారా మహాశక్తిగా ఉన్న ఎన్టీఆర్. సో… సింపుల్ గా, సూటిగా వైఎస్సార్ కానీ.., ఎన్టీఆర్ కానీ రాజకీయాల్లోకి వచ్చింది అంతర్గతంగా కులం పేరు, కులం అండతోనే తోనే.
పార్టీ ఏర్పాటుతో కలిసి వచ్చిన అంశాలు..!!
రెడ్డి సామజిక వర్గానికి.. కాంగ్రెస్ పార్టీకి మొదటిసారిగా ఒక బలమైన ప్రత్యర్థి వచ్చారు. అప్పటికే ఎన్టీఆర్ కి ఉన్న ఛరిష్మా.., చతురత.., మాస్ ఇమేజి.., వాక్చాతుర్యం ఆయనను రాజకీయంగా ఎదిగేలా చేసింది. కాంగ్రెస్ కీ తొలి ప్రత్యామ్నాయం అనే ఒక పేరు ఓటర్లలో బాగా నానింది.. రెడ్డిల నాయకత్వానికి తొలి ప్రత్యామ్నాయం అనే పేరు ఈ పెద్ద సామాజికవర్గాల్లో బాగా నానింది. అలా అన్ని కలిసి వచ్చి.. 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్ ఘన విజయం సాధించారు.
ఎవరెన్ని చెప్పుకున్నా ఎన్టీఆర్ గొప్ప నటుడు. ఆయన నట విశ్వరూపం వెండితెరపై అనేక రూపాల్లో చూపించారు. తెలుగు సినీ తెరపై ఆయన ఒక వెలుగు. కుగ్రామానికి కూడా ఎన్టీవోడు గా సుపరిచితుడు. అటువంటి హీరో గ్రామాల్లోకి వస్తున్నాడంటే.. తమ కళ్ళ ముందే డైలాగులు చెప్తుంటే ఓట్లు పడకుండా ఉంటాయా..!? అన్నిటికీ తోడు ఎన్టీఆర్ కి కాంగ్రెస్ అంటే గిట్టని కొన్ని ప్రధాన కులాలు అండగా నిలిచాయి. కమ్మ, వెలమ సామాజికవర్గాలు ఎన్టీఆర్ ని తమవాడిగా క్షేత్రస్థాయి పోల్ మేనేజ్మెంట్ చేశాయి. అలా 1977 లో ఎమర్జెన్సీ ద్వారా ఇందిరాగాంధీ దేశం మొత్తం వ్యతిరేకత మూటగట్టుకుంటే.. అప్పుడే అంటే.. 1978 అసెంబ్లీ ఎన్నికల్లోనే ఎన్టీఆర్ ని రాజకీయాల్లో దించాలని కొన్ని సామాజికవర్గాల పెద్దలు చర్చలు జరిగినప్పటికీ ఆయన అంగీకరించలేదు. తనకు 60 ఏళ్ళు నిండిన తర్వాత వస్తానంటూ చెప్పారు. అలా ఏమీ చేయలేని పరిస్థితుల్లో 1978 లో ఏపీలో కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్, జనతా పార్టీ పోటీ పడ్డాయి.
* కేవలం కులం అండ, కులం పునాదులతో పాటూ ఎన్టీఆర్ చరిష్మా, పేద వర్గాల ఓట్లతో తెలుగు దేశం పార్టీ 1983 ఎన్నికల్లో గెలిచింది. కానీ కాంగ్రెస్ పార్టీ కన్నింగ్ రాజకీయాల కారణంగా ఏడాదిన్నరలోనే ఎన్టీఆర్ దిగిపోవాల్సి వచ్చింది. నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్ కి తొలి వెన్నుపోటు పొడిచారు. దీంతో ఎన్టీఆర్ సానుభూతి మూటగట్టుకుని.. చంద్రబాబు కన్నింగ్ నెస్ కూడా బాగా పని చేసి మళ్ళీ సీఎం అయినప్పటికీ.. ప్రభుత్వాన్ని రద్దు చేసి 1985 లో ఎన్నికలకు వెళ్లి భారీగా గెలిచారు. కానీ 1989లో ఓడిపోయారు. ఎన్టీఆర్ అంతటి మహానుభావుడు ఒక్క ఐదేళ్లు పరిపాలించాక జనంలో ఎందుకు వ్యతిరేకత వచ్చింది..? సీఎం గా ఆయన చేసిన తప్పులేమిటి..? 1989లో ఘోర ఓటమికి కారణాలేమిటి..!? ఈ కీలక అంశాలు వచ్చే కథనంలో సాయంత్రం 6.30కి పోస్ట్ చేసే కథనంలో చూద్దాం..!