విజయవాడ: చంద్రబాబుపై కోపంతో టిఆర్ఎస్ నేతలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం అంటున్నారనీ, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే వారు ఇక్కడకు వచ్చి పోటీ చేయాలనీ జనసేన అధినేత పవన్కల్యాణ్ సవాల్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కృష్ణా జిల్లాలో పలు నియోజకవర్గాల్లో పర్యటించి ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్లో వైసిపి గెలిస్తే కేసిఆర్ గెలిచినట్టేనని పవన్ వ్యాఖ్యానించారు. వైసిపి అభ్యర్థి గెలిస్తే ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టేనని పవన్ పేర్కొన్నారు.
వరంగల్లో వైసిపి అధ్యక్షుడు జగన్ను టిఆర్ఎస్ విద్యార్థి విభాగం వాళ్లు రాళ్లతో కొట్టి తరిమారని ఈ సందర్భంగా పవన్ గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పౌరుషం లేదా? తెలంగాణ నేతలకు బానిసలమా అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష నేతగా ఐదేళ్ల పాటు ఏమీ చేయని జగన్ ముఖ్యమంత్రి అయితే ఇంకేం చేస్తారని పవన్ ప్రశ్నించారు. జగన్ ఐదుగురితో ఎన్నికల ఖర్చు పెట్టించి ఒక్కరికి టికెట్ ఇస్తున్నారనీ, అభ్యర్థులను చెరుకు రసం పిండినట్లు పిండుతున్నారనీ పవన్ ఆరోపించారు. పరిశ్రమలు రావాలంటే వాటాలు అడిగే పరిస్థితి వైసిపి నేతలదని పవన్ అన్నారు.
ప్రతిపక్ష నేతకు పాదయాత్ర పేరుతో రోడ్డు మీద తిరగటమే తెలుసని పవన్ ఎద్దేవా చేశారు. శాసనసభకు వెళ్లటంలో జగన్ విఫలమయ్యారని పవన్ పేర్కొన్నారు.
జనసేన అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాలకు డొక్కా సీతమ్మ, కందుకూరి, కాటన్ దొర, అంబేడ్కర్ వంటి మహనీయుల పేర్లు పెడతామని పవన్ చెప్పారు. తన పేరుపై భవిష్యత్తులో ఒక్క పథకం పేరు కూడా ఉండబోదని పవన్ పేర్కొన్నారు.
మీ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇచ్చేందుకే జనసేన పుట్టిందని పవన్ అన్నారు. డబ్బుతో సంబంధం లేని రాజకీయాలు చేద్దాం రండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.