తెలంగాణా ఎన్నికల ఫలితాల అనంతరం కెసిఆర్ తన ప్రసంగం సందర్భంగా చేసిన వ్యాఖ్యల్లో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ చేసిన ప్రకటన ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. దీంతో ఈ విషయమై ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలో కుప్పలుతెప్పలుగా వార్తలు,వ్యాఖ్యానాలు వెలువడ్డాయి… ఇంకా వెలువడుతూనే ఉన్నాయి. తాజాగా కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు జగన్ మద్దతు ప్రకటనతో ఈ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.కారణం చంద్రబాబుకు తాను ఇస్తానన్నరిటర్న్ గిఫ్ట్ కు సన్నాహాల్లో భాగంగానే కెసిఆర్ ఎపిలో ఆయన ప్రధాన ప్రత్యర్థి అయిన జగన్ తో అర్జంట్ గా తన కుమారుడు కెటిఆర్ తో భేటీ ఏర్పాటు చేయించారని వాదన ముమ్మరంగా వినిపిస్తుండటమే.
జగన్ అలా తన పాదయాత్ర ముగించి వచ్చారో లేదో వెనువెంటనే ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు కోసమంటూ ఆయనతో భేటీ అంటూ కెసిఆర్ ప్రకటించడం, ఆ ప్రకటన వెలువడిందో లేదో ఆఘమేఘాల మీద ఆ భేటీ జరిగిపోవడం వెనక ప్రధాన కారణం మాత్రం చంద్రబాబుకు కెసిఆర్ తాను ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్
సన్నాహాల్లో భాగమేనని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. దీంతో సహజంగానే అసలు చంద్రబాబుకు కెసిఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏమిటి?…ఎప్పుడు ఎలా ఇస్తారు?… దాని స్థాయి ఎంత?…అనే విషయాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
అయితే కెసిఆర్ మనస్తత్వం తెలిసిన వారు ఆయన ప్రత్యర్థులను టార్గెట్ చేశారంటే వారిని దెబ్బతీసే విషయంలో ఏమాత్రం అలక్ష్యం చేయరని, అలాంటిది చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ గురించి కెసిఆర్ అంత ఓపెన్ గా ప్రకటన చేశారు కాబట్టి ఇక ఆ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గే అవకాశం ఉండదంటున్నారు. అందుకే తన ప్రకటనను వీలైనంత త్వరగా కార్య రూపం దాల్చేందుకు వీలుగా కెసిఆర్ తనదైన శైలిలో భారీ స్థాయిలోనే సన్నాహాలు చేపట్టారని, అందులో భాగమే తాజాగా జగన్ తో కెటిఆర్ భేటీ అని సులభంగానే అర్థం చేసుకోవచ్చంటున్నారు.
అందుకే ఎపి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు తెలంగాణా సిఎం స్థాయిలో ఉన్న కెసిఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏ రేంజ్ లో ఉండొచ్చనే అంశంపై కూడా వివిధ రకాల విశ్లేషణలు చోటుచేసుకుంటున్నాయి. ఏదేమైనా కెసిఆర్ తన ప్రత్యర్థిని దెబ్బతీయదలుచుకుంటే అది గట్టిగానే ఉంటుందనేది ఆయన స్వభావం గురించి తెలిసినవారు చెప్పేమాట. అందుకే చంద్రబాబుకు కూడా అనూహ్యమైన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు కెసిఆర్ ఒక ప్రణాళిక ప్రకారం సన్నాహాలు కొనసాగిస్తూ…అందులో భాగంగా జగన్ తో మంతనాలు జరపడం కూడా పూర్తి చేశారంటున్నారు.
అయితే ఈ రిటర్న్ గిఫ్ట్ సన్నాహాలకు సంబంధించి కెసిఆర్ స్టెప్ బై స్టెప్ పద్దతిలోనే కాకుండా సమాంతర పద్దతిలో కూడా కొనసాగిస్తూ ఉండొచ్చని…ఆ క్రమంలో కెసిఆర్ తరువాత భేటీ ఎపిలో చంద్రబాబుకు ప్రస్తుతానికి ఇంకా ప్రత్యర్థిగానే ఉన్న పవన్ కళ్యాణ్ తో కావచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాదు పవన్ తో భేటీ తమకి సానుకూలంగా ఉండేందుకు గాను అవసరమైన ఫ్లాట్ ఫామ్ ను కూడా కెసిఆర్ ఇప్పటికే పూర్తిచేశారనడానికి ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలే నిదర్శనం అంటున్నారు.
వ్యూహరచనలో చాణుక్యం ప్రదర్శించే కెసిఆర్ పవన్ విషయంలోనూ అదే చతురతను కనబర్చారని…అది పవన్ పై ఫ్యామిలీ సెంటిమెంట్ ప్రయోగం ద్వారా తమ దారిలోకి తెచ్చుకోవాలనేదే ఆ ప్లాన్ అని…దాన్ని అనుకున్న విధంగానే అమలు చేస్తూ వచ్చారని…ఆ క్రమంలో చివరి అంకం పవన్ తో భేటీనే కావొచ్చని
విశ్లేషిస్తున్నారు. ఇటీవల రామ్ చరణ్ సినిమా వినయవిధేయ రామ వేడుకకు కెటిఆర్ హాజరవడం…ఆ వేడుకలో రామ్ చరణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవితో అత్యంత సన్నిహితంగా మెలగడం పరస్పరం ప్రశంసలు పవన్ ను తమ రూట్లోకి తెచ్చుకునేందుకు కెసిఆర్ అమలు చేసిన వ్యూహంలో భాగమే అయివుండొచ్చని
అంటున్నారు. అంతేకాదు ఆ తరువాత కెటిఆర్ మెగాస్టార్ చిరంజీవి నివాసానికి భోజనానికి కూడా వెళ్లారని, అక్కడ వారి కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడారని సినీ సర్కిళ్లలో ప్రచారం జరుగుతుండటం గమనార్హం.
ఇలా చంద్రబాబుకు ప్రత్యర్థులైనవారితో భేటీల పర్వం కొనసాగిచ్చేది ఆయనకు గట్టి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకే అనడంలో సందేహం అక్కర్లేదని…అయితే ఈసారి భేటీ పవన్ కళ్యాణ్ తో కావొచ్చనే అంచనాల నేపథ్యంలో మరి పవన్ ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. పైగా నిన్నటిదాకా ఉప్పూ నిప్పులా ఉన్న
టిడిపి-జనసేన ఇటీవలి కాలంలో మళ్లీ పరస్పరం అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నట్లు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ పవన్ తో జత కట్టేందుకే చంద్రబాబు పావులు కదుపుతున్నారని…పవన్ కూడా అందుకు సానుకూలంగానే స్పందిస్తున్నట్లు కనిపిస్తోందని వైసిపి మద్దతుదారుల వాదన. మరి
అంతకుముందయితే చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ విషయంలో కెసిఆర్ కు పవన్ సహకరించే అవకాశం ఉంటుందని ఊహించవచ్చు గాని మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన స్పందన ఎలా ఉంటుందనేది అనూహ్యమేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అయితే ఈ విషయమై స్పష్టత కోసం తెలుగు ప్రజలు మరీ ఎక్కువ కాలం వేచిచూడాల్సిన అవసరం ఏమీ ఉండదని, కొద్ది రోజుల్లోనే ఆ సంగతీ తేలిపోతుందని అభిప్రాయపడుతున్నారు.