రాష్ట్ర నీటి హక్కుల విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫుల్ క్లారిటీ తో ఉన్నారని అన్నారు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి. అపెక్స్ కౌన్సిల్ లో గట్టిగా వాదనలు వినిపిస్తామని చెప్పారు. స్నేహపూరిత వాతావరణంలో సమస్య తెలంగాణ ప్రభుత్వంతో పరిష్కారం అవుతుంది అనే ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఫుల్ మెజార్టీతో ఉందని, అలాంటప్పుడు వైసీపీతో అవసరం ఏముంటుంది అని ప్రశ్నించారు. బిజెపి పార్టీ నుండి గతం నుండి ప్రతిపాదనలు వచ్చాయని, కానీ బిజెపితో కలసి రాజకీయాలు చేసే ఆలోచన లేదని పేర్కొన్నారు.
ఇటీవల ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. అదే విధంగా జగన్ ఢిల్లీ పర్యటన విషయం గురించి యాంకర్ ప్రశ్నించగా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధాని మోడీ తో జగన్ భేటీ అవుతున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. ప్రాజెక్టులు, స్పెషల్ స్టేటస్ మొదటి నుంచి కేంద్రం దగ్గర జగన్ అడుగుతున్నారని వాటి కోసమే అన్నట్టుగా..జగన్ ఢిల్లీ పర్యటన గురించి క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా ఇటీవల ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో బిజెపితో జగన్ కలిసి పోతున్నట్లు, కేసులు మాఫీ చేసుకుంటున్నట్లు వరుస కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నారు.
అందువల్లే జగన్ రెండుసార్లు ఢిల్లీ పర్యటన చేపట్టినట్లు… రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి జగన్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఢిల్లీ యాత్ర చేపడుతున్నట్లు ఆయా మీడియా ఛానళ్లు వరుసగా వార్తలు ప్రసారం చేస్తూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంతో కలిసే ప్రసక్తి లేదు అని క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీంతో బీజేపీతో జగన్ కలుస్తున్న వార్తలకు పుల్ స్టాప్ పెట్టినట్లు అయింది.