అమరావతి: వివాదాస్పద నేతగా గుర్తింపు తెచ్చుకున్న దెందులూరు టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై ఉచ్చుబిగుసుకొంటోంది. ఇప్పటికే ఆయనపై వ్యవసాయ శాఖ పైపులు దొంగిలించారన్న ఆభియోగంపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా మరో వివాదంలోనూ ప్రభాకర్ చిక్కుకున్నారు. ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పశుసంవర్థక శాఖలో అక్రమాలు జరిగాయని వైసిపి నేత, ప్రస్తుత ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి నేడు ఆరోపించారు.
పశుసంవర్థక శాఖ నుండి లబ్దిదారులకు అందాల్సిన ఫలాలను చింతమనేని కుటుంబ సభ్యులు అక్రమంగా పొందారని అబ్బయ్య చౌదరి విమర్శించారు. లబ్దిదారుల జాబితాలో చింతమనేని ప్రభాకర్ భార్య, తండ్రి కేశవరావుల పేర్లు ఉన్నాయని అబ్బయ్యచౌదరి ఆరోపించారు.
ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ దృష్టికి వైసిపి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తీసుకువెళ్లడంతో వెంటనే ఆయన స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని పశుసంవర్థక శాఖ అధికారులను ఆదేశించారు.
ఎన్నికల సమయంలో వైసిపి అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై చింతమనేని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం విదితమే.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?