అమరావతి: తెలుగుదేశం పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది. సోమవారం సీఎం జగన్తో టీడీపీ ఎమ్మెల్యే భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి సీఎంను కలిశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మద్దాలి గిరిని జగన్ వద్దకు తీసుకెళ్లారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గిరి గెలుపొందారు. అమరావతి నుంచి రాజధాని తరలించడాన్ని టీడీపీ వ్యతిరేకిస్తోంది. రాజధానికి భూములిచ్చిన రైతులతో కలిసి ఆందోళన నిర్వహిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే సీఎం జగన్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైశ్య సామాజిక వర్గానికి చెందిన వెల్లంపల్లితో అదే సామాజిక వర్గానికి చెందిన మద్దాలి గిరి గత కొంత కాలంగా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. గిరి టీడీపీని వీడుతారని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీని వీడిన సంగతి తెలిసిందే.