Telangana Election: కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు ఉన్నట్లు తెలంగాణ బీఆర్ఎస్ సర్కార్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. పదేళ్ల పాటు అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడంతో యువతలో నిరుత్సాహం, రైతు బంధు పథకాన్ని అనర్హులకు (వందలాది ఎకరాలు ఉన్న భూస్వాములకు) కూడా ఇవ్వడం, దళిత బంధు పథకంలో అవినీతి, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్రంగా ఉన్న అసంతృప్తి, ప్రాజెక్టుల్లో అవినీతి ఆరోపణలు ఇలా అనేకం ఉన్నాయి. వీటన్నింటికీ తోడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన అయిదు గ్యారెంటీ స్కీమ్ లు, కేసిఆర్ పై రేవంత్ రెడ్డి దూకుడుగా వెళుతుండటం, నేతల మధ్య ఉన్న విభేదాలను పక్కన బెట్టి సమైక్యంగా పార్టీ గెలుపునకు కృషి చేయడం, పాత బస్తీ మినహా ఇతర ప్రాంతాల్లోని ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్ మద్దతు గా నిలవడం, ఇందిరమ్మ పాలన ప్రచారంతో ఎస్సీ, ఎస్టీ వర్గాలు మళ్లీ కాంగ్రెస్ వైపునకు మళ్లడం ఇలా కారణాలు ఉన్నాయి.
ఇలా కేసిఆర్ ఓటమికి అనేక కారణాలు ఉంటే ఏపీలోని టీడీపీ అభిమానులు కేసిఆర్ కు రేవంత్ రెడ్డి ద్వారా రిటర్న్ గిప్ట్ ఇచ్చారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకోవడంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో హైదరాబాద్ తదితర ప్రాంతంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారనీ, హైటెక్ సిటీ, సైబరాబాద్ అభివృద్ధి చేసింది చంద్రబాబే అంటూ చెప్పుకుంటున్నారు. కొందరు టీడీపీ అభిమానులు ఆ పార్టీ జెండాలు పట్టుకుని కాంగ్రెస్ పార్టీ ప్రచారాల్లో పాల్గొన్నారు. టీడీపీ సానుభూతిపరులు, సెటిలర్లు, ఆ సామాజిక వర్గం వారు కాంగ్రెస్ మద్దతు ఇచ్చినట్లయితే బీఆర్ఎస్ అభ్యర్ధులు ఎలా విజయం సాధిస్తారని ప్రశ్నిస్తున్నారు.
సెటిలర్ల ఓట్లు అధికంగా ఉన్నకూకట్ పల్లి, శేరిలింగంపల్లి, ఖుత్భుల్లాపూర్ తదితర నియోజకవర్గాల్లో ఎక్కడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు గెలవలేదు. హైదరాబాద్ సిటీ పరిధిలోని 15 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ఓటమి పాలై అధికార బీఆర్ఎస్ అభ్యర్ధులే గెలిచారు. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత కూడా లేకపోవడం అని చెబుతున్నారు. ఇక నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ స్పీప్ చేయడానికి సమర్ధులను నాయకులను కేసిఆర్ వదులుకోవడమేనని అంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ల కారణంగా ఆయా జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి గెలుపునకు కృషి చేశారని అంటున్నారు. అలానే ఉమ్మడి నల్లగొండ జిల్లా విషయానికి వస్తే సీనియర్ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరుల కారణంగా జిల్లాలో అత్యదిక సీట్లు కాంగ్రెస్ గెలుచుకుందని అంటున్నారు. టీడీపీ అనుకూల మీడియా, టీడీపీ సోషల్ మీడియా చంద్రబాబు కారణంగానే తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి పాలైందనీ, రేవంత్ నేతృత్వంలోకాంగ్రెస్ గెలిచిందని ప్రచారం
హైదరాబాద్ ను తానే విపరీతంగా అభివృద్ధి చేశానని చెప్పుకునే చంద్రబాబు..ఎన్టీఆర్ ఆగర్భ శత్రువు గా భావించే కాంగ్రెస్ పార్టీ కి లోపాయకారిగా మద్దతు ఇస్తే హైదరాబాద్ సిటీలో ఉన్న 15 స్థానాల్లో ఒక్కటి కూడా ఎందుకు గెలవలేదని అంటున్నారు. హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులకు వచ్చిన మెజార్టీలను పరిశీలిస్తే చంద్రబాబు, టీడీపీ సానుభూతిపరులు చేసింది ఏమీ లేదనే మాట వినబడుతోంది. కూకట్ పల్లిలో మెజార్టీ 70387, శేరిలింగంపల్లి లో 46,552, కుత్భుల్లాపూర్ లో 85,576, అంబర్ పెట్ లో 24,537, జూబ్లీహిల్స్ లో 16,000, ఖైరతాబాద్ లో 22,010, ఎల్బీ నగర్ లో 22,305, మల్కాజిగిరిలో 49,530, మేడ్చల్ లో 33,419, ముషీరాబాద్ లో 37,797, పటాన్ చేరులో 7,091, రాజేంద్ర నగర్ లో 32,096, సనత్ నగర్ లో 41,827, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో 17,169, ఉప్పల్ లో49,030 మెజార్టీ వచ్చింది. దయచేసి బీఆర్ఎస్ ను ఓడించింది తామే అను ప్రచారం చేసుకోవద్దని హితవు పలుకుతున్నారు.