నల్గొండ: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు వరుసపెట్టి కారెక్కేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు, మాజీలు గులాబీ కండువా కప్పుకున్నారు. మరో మాజీ ఎమ్మెల్యే కూడా గులాబీ గూటికి చేరేందుకు సమాయత్తమవుతున్నారు.
నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం లేదని ఆయన ఆరోపించారు. బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.
కేసిఆర్, కేటిఆర్ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితుడై టిఆర్ఎస్లో చేరనున్నట్లు భిక్షమయ్య గౌడ్ తెలిపారు.
భువనగిరి లోక్సభ టిక్కెట్ తనకు దక్కుతుందని భిక్షమయ్య గౌడ్ ఆశించారు. కానీ అధిష్టానం తనను కాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టిక్కెట్ ఇవ్వడంతో ఆయన పార్టీ వీడాలని
నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన సమయంలో ఆయన వెంట బిక్షమయ్య గౌడ్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన టిఆర్ఎస్లో చేరాలనుకోవటంతో ఎన్నికల వేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
2009 ఎన్నికల్లో బూడిద భిక్షమయ్య గౌడ్ ఆలేరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికలతో పాటు గత సంవత్సరం డిసెంబర్ నెలల్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.