హైదరాబాద్: మొన్నటి ఎన్నికలలో పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికార టిఆర్ఎస్లోకి ఫిరాయించిన అనుభవంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంభందించి కాంగ్రెస్ పార్టీ ముందస్తు చర్యలు చేపట్టింది.
పార్టీ తరుపున పోటీ చేయాలంటే గెలిచాక పార్టీ మారబోమని అభ్యర్థులు బాండ్ పేపర్పై హామీ రాసివ్వాలి. ఒకవేళ పార్టీ మారితే కేసు పెట్టుకునేలా అంగీకారాన్ని అందులో పొందు పరచాలి.
స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ ముఖ్యనేతలు బుధవారం గాంధీ భవన్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రతిపాదించారు. దీనిపై చర్చ జరుగుతున్నది.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. మండల పరిషత్, జడ్పి చైర్మన్కు ప్రత్యక్ష ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో తాము సెలెక్ట్-ఎలెక్ట్ పద్దతిని ప్రవేశ పెడుతున్నామనీ, ప్రజలే అభ్యర్థిని ఎంపిక చేసుకునే వెసులుబాటు ఇస్తున్నామనీ ఉత్తమ్ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.
అలాగే పోలీసు శాఖ, టిఆర్ఎస్పై ఉత్తమ్ విమర్శలు చేశారు. పోలీసులు అత్యుత్సహం ప్రదర్శిస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. మంద కృష్ణ మాదిగను హౌస్ అరెస్ట్ చేయడం నిరంకుశమేనని ఉత్తమ్ అన్నారు. అంబేద్కర్ విగ్రహ కూల్చివేత అంశాన్ని జాతీయ స్థాయిలో లేవనెత్తుతాం అని ఉత్తమ్ తెలిపారు. అంబేద్కర్ను ప్రభుత్వం అవమానించిందని ఉత్తమ్ దుయ్యబట్టారు.
కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఉత్తమ్ మండిపడ్డారు. ఆయనకి పార్టీ మద్దతు ఉంటుందని ఉత్తమ్ పేర్కొన్నారు.