ఉమ్మడి శత్రుత్వం ఇద్దరు నాయకులను మిత్రులను చేసింది. ఈ మిత్రబందం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరబూసింది. రాజకీయంలో ఎల్లకాలం శత్రుత్వం, మిత్రుత్వం ఉండదని అంటారు. అయితే.. వీరిద్దరి మధ్య ప్రస్తుతం ‘నీరు’ నిప్పు పెట్టింది. ప్రస్తుతానికి వీరిద్దరి మధ్యా కత్తులు దూసుకునేంత కయ్యం లేకపోయినా ఒకరికొకరు నోరు జారేంత అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్లిద్దరే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్. ప్రస్తుతం వీరిద్దరూ విమర్శలు చేసుకోకున్నా.. ప్రభుత్వ తీరుపై తప్పు బడుతున్నారు. వ్యక్తిగత విమర్శలు చేసుకునేంత వరకూ వస్తే రాజకీయం మరింత వేడి రాజేసి ఘాటు పుడుతోంది. మరి తెలుగు రాష్ట్రాల్లో వీరిద్దరి ఘాటు ఏమేరకు చేరుతుందో చూడాలి. ప్రస్తుతం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే..
కేసీఆర్ ఏమన్నారంటే..
తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఏపీ అర్ధంలేని ఆరోపణలు చేస్తోంది. కేంద్రప్రభుత్వం ఈ విషయంలో తప్పుడు విధానాల్లో వెళ్తోంది. గోదావరి మిగులు జలాల్లో మరో వెయ్యి టీఎంసీలు తెలంగాణాకు దక్కాలి. గోదావరి, కృష్ణా బేసిన్లలో తెలంగాణకు చెందిన వాటా ప్రకారమే ప్రాజెక్టులు చేపడుతున్నాం. ప్రస్తుతం చేపడుతున్న ప్రాజెక్టులు తెలంగాణ ఆవిర్భావానికి ముందే మంజూరై ఉన్నాయి. వీటికి కేటాయింపులు, సీడబ్ల్యూసీ అనుమతులు కూడా ఉన్నాయి. వీటిపై 23వేల కోట్ల ఖర్చు, 31,500 ఎకరాల భూసేకరణ కూడా పూర్తయింది. వీటిని కొత్త ప్రాజెక్టులు అనడం అర్దరహితం. చాలా ప్రాజెక్టులు తెలంగాణ అవసరాలకు తగ్గట్టుగా చేయలేదు. అందుకే రీడిజైన్ చేస్తున్నాం. పెన్ గంగ ప్రాజెక్టులకు 1975లోనే ఒప్పందాలు జరిగాయి.
సముద్రంలో కలిసే రెండు వేల టీఎంసీల్లో తెలంగాణకు వెయ్యి టీఎంసీలు కేటాయించాలి. సాగునీటి రంగంలో తెలంగాణకు మొదటి నుంచీ అన్యాయం జరుగుతోంది. ఏపీ సీఎంను పిలిచి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ట్రాల రైతుల కోసం ప్రాజెక్టులు కట్టుకుందామని చెప్పాను. వృధాగా సముద్రం పాలవుతున్న నీటిని రైతుల పొలాలకు మళ్లిద్దామని కూడా చెప్పాను. అయినా ఏపీ ప్రభుత్వం గిచ్చి కయ్యం పెట్టుకుంటోంది. ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదు చేయడం సరికాదు. అపెక్స్ సమావేశంలో ఏపీకి, కేంద్రానికి గట్టి సమాధానం చెప్పాలి.