ఈ కేంద్ర ప్రభుత్వం హయాంలో చివరిదైన 2019 బడ్జెట్ లో సైతం మరోసారి ఆంధ్రప్రదేశ్ కు తీవ్రమైన అన్యాయమే జరిగింది. ఇలా బడ్జెట్ల లోనే కాకుండా అన్నిరకాల నిధుల కేటాయింపుల్లో కొత్త రాష్ట్రానికి ఏమాత్రం సహకరించడకుండా ఘోరంగా దెబ్బతీస్తున్న మోదీ ప్రభుత్వం మరోసారి ఆంధ్రప్రదేశ్ పట్ల తనకున్న వివక్షతను స్పష్టంగా చాటుకుంది. అయితే రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తున్నా ఎపి బిజెపి నేతలు కేంద్రాన్ని వెనుకేసుకు వస్తున్న తీరు…కారణాలు ఏమైనప్పటికీ ఎపి పట్ల కేంద్రం చూపుతున్న వివక్షను నిలదీస్తున్న టిడిపి ప్రభుత్వంపై ఎదురుదాడికి తెగబడుతున్న వైనం రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్య ప్రజల్లోనూ
చర్చనీయాంశంగా మారింది. ఈ చర్చల ప్రధాన సారాంశం ఒక్కటే…అది ఎపి బిజెపి నేతలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారనేదే!
ఎపికి ప్రత్యేక హోదా కోసం అధికార పార్టీ టిడిపి నిరసన కార్యక్రమాల నేపథ్యంలో శుక్రవారం అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు ఆ పార్టీ గురించే కాకుండా ఎపి బిజెపి నేతల వైఖరి గురించి సర్వత్రా చర్చకు దారి తీశాయి. ప్రధాని మోడీ వల్లే ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం జరిగిందంటూ సిఎం చంద్రబాబు తిరుగుబాటు చేస్తుండటంతో…కొంతకాలం వేచిచూసే వైఖరి అవలంబించినట్లు కనిపించిన బిజెపి అధినాయకత్వం తదనంతరం రివర్స్ ఎటాక్ మొదలు పెట్టింది.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ పార్టీ నేతలతో కలసి ఫిబ్రవరి 11న దేశ రాజధాని ఢిల్లీలో దీక్ష చేయాలని ఎపి సిఎం చంద్రబాబు నిర్ణయించారు. అంతేకాదు ఆ తరువాత రోజు అంటే ఫిబ్రవరి 12న రాష్ట్రపతిని కలిసి ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం గురించి వివరించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే చంద్రబాబు చర్యలకు కౌంటర్ గానా అన్నట్లుగా ఫిబ్రవరి 10నే పిఎం మోదీ ఏపి పర్యటనకు వస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన గుంటూరులో బహిరంగ సభలో పాల్గొంటారు. దీంతో టిడిపి-బిజెపి అధినాయకుల వ్యూహ,ప్రతివ్యూహాలతో ఈ పోరు మరింత తీవ్ర రూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తోంది.
అయితే ఇదంతా ఒక ఎత్తయితే రాష్ట్రానికి జరిగిన అన్యాయం విషయంలో ఎపి బిజెపి నేతలు వ్యవహరిస్తున్న తీరుపై రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం కూడా సుస్పష్టమే. ఎన్నికల సమయంలో ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని మోడీనే స్వయంగా వాగ్ధానం చేసి ఆ తరువాత ఆ విషయంలో మాట మార్చేసిన వైనం, స్పెషల్ స్టేటస్ ఇవ్వకున్నా నిధుల కేటాయింపు విషయంలో ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి లోటు పూరించే ప్రయత్నం చేయకపోవడం, పైగా టిడిపి ఆరోపిస్తున్న విధంగా రాష్ట్రంపై మోడీ వివక్ష చూపుతున్నట్లు స్పష్టంగా కనిపించడం…
ఇక తాజా 2019-20 బడ్జెట్ విషయానికొస్తే ఇందులో అసలు ఆంధ్ర ప్రదేశ్కు కనీస ప్రాధాన్యత లేకపోవడం షాక్ కలిగించింది. పెండింగ్ ప్రాజెక్టుల విషయం అటుంచి నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణం, దుగరాజుపట్నం పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ వంటి ప్రాజెక్టుల గురించి బడ్జెట్లో అసలు ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఎపిలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విద్యాసంస్థల్లో మూడంటే మూడిటికి నిధులు కేటాయించింది. సెంట్రల్ యూనివర్శిటీకి రూ. 13 కోట్లు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీకి(ఐఐపీఈ) రూ. 31.82 కోట్లు, ఎపి-తెలంగాణ రాష్ట్రాల గిరిజన విశ్వవిద్యాలయం కోసం ఉమ్మడిగా రూ. 8 కోట్లు కేటాయించడం జరిగింది. అయితే ఇవి కూడా అరకొర నిధులే కావడం గమనార్హం. ఇలా ఎపికి అన్ని విధాలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అన్యాయం చేసిన పరిస్థితులు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా రాష్ట్ర బిజెపి నేతలు ఆ విషయమై ప్రతిస్పందిస్తున్న తీరు విస్తుగొలుపుతోంది.
తాజా బడ్జెట్ లో ఎపికి కేంద్రం కేటాయింపులు చూస్తే రాష్ట్రంపై బిజెపి ఆశలు వదిలేసుకుందేమోననే సందేహం కలగకమానదు. సార్వత్రిక ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ఈ చివరి బడ్జెట్ సహజంగా ఓట్లు రాల్చుకునేందుకు తాయిలాలు ప్రకటించే చందంగా ఉండటం కద్దు. కానీ ఎపి విషయంలో కేంద్రం తీరు ఇక ఇక్కడ ఏం చేసినా ఓట్లు రావని ఫిక్సయిపోయినట్లో, లేక ఎపిలో తాము స్వయంగా చేసేదేమీ లేదని…ప్రత్యామ్నాయ మార్గాల చూసుకోవచ్చని భావించినట్లో కనిపిస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర బిజెపి నేతలు ఎపికి న్యాయం విషయంలో కేంద్రాన్ని కన్విన్స్ చేసేందుకు చిత్త శుద్దితో ప్రయత్నించినట్లు కనపడలేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఆ ప్రయత్నం చేయకపోవడం అటుంచి రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సిఎం చంద్రబాబు,టిడిపి నేతలు కేంద్రాన్ని నిలదీస్తుంటే వారిపై ఎదురుదాడికి దిగడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల తమ పట్ల, తమ పార్టీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత చోటుచేసుకుంటుందనే విషయం బిజెపి నేతలకు తెలిసినా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాతో సహా ముఖ్య నేతలందరూ అదే బాట పట్టడం విస్తుగొలుపుతోంది. రాజకీయంగా బలోపేతమవ్వాలనుకునే ఏ పార్టీ అయినా ఈ విధమైన మార్గం అవలంభించడం ఆత్మహత్యాసదృశ్యం అని తెలిసి కూడా బిజెపి నేతలు ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు?…తద్వారా వారు ఏమి ఆశిస్తున్నారు?… అసలు ఇలా ఇదంతా ఎందుకు చేస్తున్నారనేది…ప్రస్తుతానికి ఇంకా సస్పెన్స్ వీడని మిలియన్ డాలర్ల ప్రశ్నలు గానే మిగిలిపోతున్నాయి.