హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు రోజుకో కొత్త నాటకంతో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని వైసిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. లోటస్పాండ్లోని వైసిపి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్పై జీవితాంతం తనకే హక్కు ఉన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని సజ్జల అన్నారు.
ఎన్నికల కమిషన్పై లేనిపోని ఆరోపణలు చేస్తూ చంద్రబాబు నానా యాగీ చేస్తున్నారని సజ్జల దుయ్యబట్టారు. ఈసీని హెచ్చరించే ధోరణిలో బాబు వ్యవహరిస్తున్నారని సజ్జల పేర్కొన్నారు.
సరైన సమయంలో సమీక్షలు చేయకపోవడం వల్లే రాష్ట్రంలో పిడుగులు పడి ఏడుగురు చనిపోయారని ఈసీకి రాసిన లేఖలో చంద్రబాబు ప్రస్తావించడం హాస్యాస్పదంగా ఉందని సజ్జల అన్నారు.
చంద్రబాబు రాసిన లేఖ చూస్తుంటే ఆయన్ను ఏమనాలో అర్థం కావడం లేదని సజ్జల అన్నారు.
రాష్ట్రానికి కష్టాలు తీసుకొచ్చిన చంద్రబాబును ఇంటికి సాగనంపాలని ప్రజలు నిర్ణయించుకున్నారని సజ్జల తెలిపారు.
చంద్రబాబు చేసే సమీక్షలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని సజ్జల అన్నారు.
కమీషన్ల కోసమే పోలవరం ప్రాజెక్టుపై సమీక్షలు చేశారనీ, ఈ ఐదేళ్లలో రాజధాని నిర్మాణం కోసం ఒక్క పర్మినెంట్ నిర్మాణం కూడా చేయలేదని సజ్జల వివరించారు. ఈ ఐదేళ్లు చిత్తశుద్ధితో పని చేసి ఉంటే రాజధాని నిర్మాణం పూర్తయ్యేది కాదా అని సజ్జల ప్రశ్నించారు.