వైసీపీ రెబల్ ఎంపి రఘు రామకృష్ణరాజు రోజు ఎదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. కాలం గడుస్తున్న కొద్దీ, రోజులు మారుతున్న కొద్దీ అయన వ్యాఖ్యల్లో పదును పెరుగుతోంది. ఆరంభంలో వైసిపి ఎమ్మెల్యేలను మాత్రమే ఢీ కొన్న ఆయన తర్వాత వైసీపీలోని ద్వితీయ శ్రేణి నాయకులను వ్యంగంగా విమర్శించారు. తర్వాత వైసీపీ అధినేత జగన్ మంచి వ్యక్తి, పాలన బాగుంది అంటూనే విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి లాంటి వారి మీద విమర్శలు చేశారు. కాలక్రమేణా జగన్ ను, ఆ పార్టీని విమర్శించడం మొదలు పెట్టారు. ప్రస్తుతం పూర్తిగా ప్రభుత్వ పని తీరునే తప్పుబడుతూ ప్రభుత్వ పనితీరు బాగాలేదని, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని అన్న రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా వైసీపీకి ఏయే అంశాలు వ్యతిరేకంగా ఉన్నాయో వాటిని అనుకూలంగా మాట్లాడుతూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
న్యాయవ్యవస్థను గౌరవించక పోతే రాష్ట్రంలో ఆర్టికల్ 356 ఉపయోగించి రాష్ట్రపతి పాలన వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రభుత్వానికి హెచ్చరించారు. న్యాయ వ్యవస్థను గౌరవించాలని ఇటీవల వైఎస్ విజయమ్మ రాసిన బుక్లో కూడా ఉందనీ, సీఎం జగన్ ఆ బుక్ అయితే ఆవిష్కరించారు కానీ చదవలేదని సెటైర్ వేశారు. బోలెడంత మంది సలహాదారులు ఉన్నా వారేమో సరైన సలహాలు జగన్ కు ఇవ్వడం లేదని, చెప్పుడు మాటలు విని ముఖ్యమంత్రి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ఇప్పటికే రమేష్ కుమార్కు చాలా దారుణం జరిగింది. గవర్నర్ మాట ఎలాగూ వినలేదు.. కనీసం సుప్రీంకోర్టు తీర్పునైనా గౌరవించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ను ఎస్ఈసీ పోస్టులో తిరిగి నియమించాలని అయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా న్యాయ వ్యవస్థను ప్రభుత్వం గౌరవించాలని సూచించారు. ఇప్పుటికే ఈ విషయంలో ప్రభుత్వంపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయన్నారు రఘు రామ కృష్ణం రాజు. కరోనా విషయంలో జగన్ సీరియస్ గా స్పందించకపోవడం వల్లే రాష్ట్రం అంతటా కోవిడ్ విస్తరించిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా కరోనాపై జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్య మంత్రి కూడా మాస్క్ ధరించి ప్రజలకు స్ఫూర్తిని ఇవ్వాలని సూచించారు. తనపై ఇచ్చిన అనర్హత పిటిషన్ పై అయన మాట్లాడుతూ రమేష్కుమార్ విషయంలో ఎలా భంగపడ్డారో, తన విషయంలోనూ ప్రభుత్వానికి భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు.
రఘురామ కృష్ణం రాజు పై అనర్హత వేటు పడే వరకు, క్రమశిక్షణ చర్యలు తీసుకునే వరకు రాజుగారినోటికి తాళం, అడ్డు అదుపు ఏమీ ఉండదు. ఇది ఇప్పట్లో జరిగేది కాదు. అయన వెనుక ఎవరు ఉన్నారు అనేది పక్కన పెడితే ఒక ఎంపిగా, ఒక నాయకుడుగా, ఒక వ్యక్తిగా ఆయన స్వేచ్ఛగా మాట్లాడగలుగుతారు. దాన్ని జగన్ వ్యతిరేక మీడియా హైలెట్ చేస్తూ చూపించ గలుగుతుంది. ఇది జరిగినంత కాలం ఈ వ్యవహారానికి పురిస్టాప్ పడదు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?