అమరావతి: ప్రజావేదికను కూల్చివేయడం తుగ్లక్ చర్యగా టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అభివర్ణించడంపై వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
రివర్ కన్జర్వేషన్ యాక్ట్ను ఒక సారి యనమల చదివితే ఎవరు తుగ్లకో తెలుస్తుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నదీ తీరాన్ని పూడ్చి కట్టిన నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేయాల్సిందిపోయి కాపాడాలని అడ్డుపడటం వింతగా ఉందని విజయసాయిరెడ్డి అన్నారు. పకృతి వనరులను ధ్వంసం చేసినందుకే కదా ప్రజలు మీకు వాతలు పెట్టి తరిమేశారు అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
పోలవరం అంచనాల ఆమోదించాలనీ, నిధులు విడుదల చేయాలనీ ప్రధాని మోదిని కలిసినప్పుడు సిఎం జగన్ కోరారనీ దానికి స్పందనగానే 55,549కోట్ల రూపాయల సవరించిన అంచనాకు గ్రీన్ సిగ్నల్ లభించిందని విజయసాయిరెడ్డి అన్నారు. ఇది తన తండ్రి కష్టానికి ఫలితమని లోకేష్ డబ్బా కొట్టుకోవడం ఆపాలని విజయసాయిరెడ్డి హితవు పలికారు. ఖర్చు చేసిన నిధులకు లెక్కలు చూపకుండా మొండికేసిన చరిత్ర తమదని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.