సత్తెనపల్లి: దేశ వ్యాప్తంగా జిఎస్టి ఉంటే సత్తెనపల్లిలో కెఎస్టి (కోడెల సర్వీస్ టాక్స్) ఉందని వైసిపి అధినేత జగన్ ఆరోపించారు. కోడెల శివప్రసాదరావు కుటుంబం ఇక్కడ అవినీతి రాజ్యమేలుతోందని జగన్ దుయ్యబట్టారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో బుధవారం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోడెల ఫ్యామిలీపై తీవ్ర ఆరోపణలు చేశారు.
‘పాదయాత్రలో మీరు చెప్పిన ప్రతీ సమస్య గుర్తుంది. సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజక వర్గాల్లో కోడెల సర్వీస్ టాక్స్ వేస్తున్నారని ప్రజలు అంటున్నారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో కోడెల ప్రజలకు చేసిందేమీ లేదు’ అని జగన్ విమర్శించారు. ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన కోడెల స్పీకర్ పదవి చేపట్టి ఆ పదవిని భ్రష్టు పట్టించారని జగన్ వ్యాఖ్యానించారు.
చంద్రబాబుపై కూడా జగన్ విమర్శలు చేశారు. చంద్రబాబు వారం రోజులో గద్దె దిగిపోతారన్న ఆనందం డ్వాక్రా మహిళల కళ్లల్లో కనిపిస్తోందని జగన్ అన్నారు. ఐదేళ్ల బాబు పాలనలో అంతా మోసమే చూశామని జగన్ పేర్కొన్నారు.
పచ్చ పత్రికలు వైసిపిపై రోజుకో అబద్ధం ప్రచురించడం, దాన్ని చంద్రబాబు తన ప్రచారంలో వాడుకోవడం నీచమైనదని జగన్ అన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో వనరులను దోచుకుంటున్నా ఎల్లో మీడియాకు కనిపించడం లేదని విమర్శించారు. రాష్టాన్ని టిడిపి నేతలు అడ్డగోలుగా దోచేశారని జగన్ ఆరోపించారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదని జగన్ విమర్శించారు. బాబు ఇచ్చే మూడు వేల కోసం ఆశపడొద్దని జగన్ అన్నారు. చంద్రబాబు మాయమాటలు ప్రజలు నమ్మొద్దని జగన్ సూచించారు.
పార్టీ సమీక్షల పేరుతో మంగళవారం ప్రచార కార్యక్రమానికి విరామం ప్రకటించిన జగన్ ఈ రోజు యధావిధిగా ఎన్నికల ప్రచారం కొనసాగించారు.